శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని అవంతీపొరాలో (Awantipora) ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అవంతీపొరాలోని బారాగామ్ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారనే సమాచారంతో ఆదివారం తెల్లవారుజామున స్థానిక పోలీసులతో కలిసి భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి.
ఈక్రమంలో గాలింపు బృందాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా బలగాల కాల్పుల్లో ఓ ముష్కరుడు హతమయ్యాడని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని వెల్లడించారు. మృతిచెందిన ఉగ్రవాది ఏ సంస్థకు చెందినవాడనే విషయం ఇంకా తెలియలేదని చెప్పారు.