దుబ్బాక, జూన్ 27 : దుబ్బాక అభివృద్ధి సిగలో మరో మణిహారం చేరనున్నది. రూ.4కోట్లతో మోడల్ బస్టాండ్ అందుబాటులోకి రానున్నది. సీమాంధ్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా అభివృద్ధికి ఆమాడ దూరంగా ఉండగా, నేడు టీఆర్ఎస్ సర్కారులో దుబ్బాక అభివృద్ధి పరుగులు పెడుతున్నది. గ్రామ పంచాయతీగా ఉన్న దుబ్బాక, మున్సిపాలిటీగా అవతరించి అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. దుబ్బాకలో సీఎం కేసీఆర్ బడి, వంద పడకల దవాఖాన, డబుల్ బెడ్రూం ఇండ్లు తదితర అభివృద్ధి పనులతో పాటు పట్టణానికి ఇరువైపులా ఉన్న రామ సముద్రం చెరువుకట్ట, పెద్ద చెరువు కట్టలు ఆహ్లాదకరమైన వాతావరణంతో కనువిందు చేస్తున్నది. ఓ పక్క అభివృద్ధి.. మరో పక్క సంక్షేమ పథకాలతో ప్రజారంజక పాలన సాగుతున్నది.
మరింత వన్నె తెచ్చేలా..
దుబ్బాక పట్టణానికి మరింత వన్నె తెచ్చేందుకు బస్టాండ్ భవనం నిర్మాణం చేపట్టనున్నారు. దుబ్బాక అభివృద్ధిపై ప్రత్యేక దృస్టి సారించిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, బస్టాండు భవనానికి భారీగా నిధులు మంజూరు చేయించారు. అలాగే, దుబ్బాకపై సీఎం కేసీఆర్ మరోసారి అభిమానాన్ని చాటుకున్నారు. ఏకంగా రూ. 4 కోట్లు నిధులు మంజూరు చేశారు. దుబ్బాక పట్టణానికి తలమానికంగా మోడల్ బస్టాండ్ నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. సర్వ హంగులతో దుబ్బాకలో బస్టాండ్ నిర్మించి రాష్ట్రంలో మోడల్గా ఏర్పాటు చేయనున్నారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు భారీ బడ్జెట్తో బస్ స్టేషన్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఇటీవల ఎంపీ ప్రభాకర్రెడ్డి ప్రకటించారు. ఈ నెలాఖరులో మంత్రి హరీశ్రావు బస్టాండు పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
40ఏండ్ల చరిత్ర గల బస్టాండ్
దుబ్బాక తాలుకా ఉన్న సమయంలో 1978లో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి బస్టాండ్కు శంకుస్థాపన చేశారు. అనంతరం 1983లో నిర్మించిన బస్టాండ్ను రవాణా శాఖ మంత్రి సత్యానారాయణ ప్రారంభించారు. నాలుగు దశాబ్దాలుగా దుబ్బాక రాజకీయాలతో పాటు వ్యాపార, ఉపాధి తదితర రంగాల వారికే కాకుండా ఎక్కడెక్కడో ప్రయాణికులకు కేరాఫ్గా మారింది. దుబ్బాకలో చదువుకున్న సీఎం కేసీఆర్కు బస్టాండ్, రామసముద్రం, దేవుని బాయి తదితర ప్రాంతాలతో పాటు ప్రతీ కాలనీపై అవగాహన ఉంటుంది. గత ఉప ఎన్నికల సమయంలో దుబ్బాక బస్టాండ్ శిథిలావస్థకు చేరిన విషయాన్ని మంత్రి హరీశ్రావు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి తీసుకెళ్లగా, ముఖ్యమంత్రి వెంటనే దుబ్బాక బస్టాండ్కు రూ.4 కోట్లు మంజూరు చేశారు. మొదట తాత్కాలికంగా రూ.కోటి కేటాయించగా, మోడల్ బస్టాండ్ భవనం కోసం అదనంగా మరో రూ. 3 కోట్లు కేటాయించి, సీఎం కేసీఆర్ దుబ్బాకపై అభిమానం చాటుకున్నారు.
సర్వహంగులతో బస్టాండ్ నిర్మాణం..
దుబ్బాకలో నిర్మించనున్న బస్టాండ్ భవనం రాష్ట్రంలోనే మోడల్గా ఉండేందుకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అధునాతన హంగులతో బస్ స్టేషన్ నిర్మించేందుకు తాను ఓ ప్రైవేటు సంస్థతో నమూనా చిత్రాలను తీయించి, విడుదల చేశారు. ఎకరాకు పైగా విస్తీర్ణంలో ఉన్న బస్టాండ్ స్థలంలో ఒక వైపు నుంచి బస్లు వచ్చేందుకు, మరో వైపు నుంచి బయటకు వెళ్లేందుకు వసతులు కల్పించనున్నారు. బస్టాండ్కు వచ్చే ప్రయాణికులకు సంబంధించిన ద్విచక్ర వాహనాల పార్కింగ్కు ప్రత్యేక మార్గం, మరోవైపు బస్టాండ్ చేరుకున్న ప్రయాణికులకు అనుకూలంగా మరో మార్గం ఉంటుంది. బస్టాండ్లో బస్లు ప్లాట్ఫాం వద్దకు చేరుకునేందుకు, ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా బస్ ఎక్కేందుకు వీలుగా ప్లాట్ఫాం నిర్మాణం, బస్ కోసం వేచి ఉండే ప్రయాణికులకు కూర్చీలు తదితర వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. బస్టాండ్ స్థలంలో విశాలమైన భవనంతో పాటు షాపింగ్ కాంప్లెక్స్, ప్రైవేటు వాహనాల పార్కింగ్, పచ్చని మొక్కలతో ప్రశాంత వాతావరణం కల్పించనున్నారు. బస్టాండ్ భవనంలో 346 చదరపు అడుగుల్లో గ్రౌండ్ ఫ్లోర్ , మెజనైన్ ఫ్లోర్లు, 615 చదరపు అడుగుల స్థలంలో ఫస్ట్ ఫ్లోర్ భవనాలు నిర్మించనున్నారు. ఇదిలా ఉండగా, దుబ్బాక బస్డిపోలో 36 బస్లు కొనసాగుతున్నాయి. దుబ్బాకకు.. దుబ్బాక బస్ డిపోతో పాటు సిద్దిపేట, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, కామారెడ్డి, పికెట్ డిపోలకు చెందిన బస్లు కొనసాగుతున్నాయి.