అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. చిట్యాలలో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి పాల్గొని మాట్లాడారు. కేసీఆర్కు తెలంగాణ ఉద్యమ కాలంలోనే ప్రజలు, రైతుల కష్టాలు తెలుసని, వాటిని తీర్చేందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని, ప్రభుత్వ రంగాలను ప్రైవేటు పరం చేస్తున్నదని విమర్శించారు. మోదీ తెలంగాణపై క్షక్షగట్టి ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. దేశ వ్యాప్త మార్పు కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని వివరించారు.
– చిట్యాల, మార్చి 28
సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి : ఎమ్మెల్యే చిరుమర్తి
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే అభివృద్ధి జరుగున్నదని, దేశానికే రాష్ట్రం రోల్మాడల్గా మారిందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను నిరంతరం పాటుపడుతున్నానని, ప్రజలతోనే ఎక్కువ సమయం గడుపుతూ అందుబాటులో ఉంటున్నానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిలో తప్ప వ్యక్తిగతంగా ఎవరితో తగాదాలు లేవని వివరించారు. సంపాదనపై ఆశ ఉంటే రెండోసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తన వద్ద చాలా డబ్బులు జమ అయ్యేవని, తన వద్ద డబ్బులు లేకనే ఉన్న ఒక్క కొడుకును వ్యాపారం చేయించలేక పోతున్నారనని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తీస్తున్నదని, ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని వెల్లడించారు.
నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, సీసీ రోడ్లు, మురుగు కాల్వలు పెద్ద ఎత్తున నిర్మిస్తున్నామని తెలిపారు. గుత్తా అమిత్రెడ్డి మాట్లాడుతూ నియోజక వర్గ అభివృద్ధికి చిరుమర్తి లింగయ్య గెలుపు ఎంతో అవసరమన్నారు. మనమంతా ఒక కుటుంబంలాగా పనిచేసి పార్టీని గెలిపించుకుందామని తెలిపారు. చిట్యాల మున్సిపాలిటీతోపాటు వనిపాకల, వట్టిమర్తి, నేరడ, ఎలికట్టె, తాళ్లవెల్లంల, వేంబావి, ఉరుమడ్ల గ్రామాల కార్యకర్తలు, ప్రజలు ఈ సమ్మేళనానికి భారీ ర్యాలీగా తరలివచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ కొలను సునీతావెంకటేశ్, జడ్పీటీసీ సుంకరి ధనమ్మాయాదగిరి, చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి, మార్కెట్ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, కర్నాటి ఉప్పల వెంకట్రెడ్డి, పాటి నర్సిరెడ్డి, గుడెబోయి సైదులు, మెండె సైదులు, కూరెళ్ల లింగస్వామి, వనమా వెంకటేశ్వర్లు, మర్ల అలివేలు, బీఆర్ఎస్ మండల కార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి, పట్టణ అధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య, జిట్ట చంద్రకాంత్ పాల్గొన్నారు.
ఆత్మీయంగా పలుకరించిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ముందే చేరుకొని అక్కడికి వచ్చినవారందరినీ ఆత్మీయంగా పలుకరించారు. తమ ఊరి నుంచి ఎలా వచ్చారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. దాంతో కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామాల నుంచి కార్యకర్తలు ఆటోలు, ట్రాక్టర్లలో తరలి వచ్చారు. కనకదుర్గ సెంటర్ నుంచి సమావేశం నిర్వహంచే ఫంక్షన్ హాల్ వరకు దాదాపు రెండు కిలో మీటర్ల భారీ ర్యాలీ నిర్వహించారు. ఎండలోనే ఎమ్మెల్యే కూడా కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు.