రామగిరి, నవంబర్ 22 : యువత చదువులోనే కాకుండా, సంస్కృతి, కళలు, సాహిత్యం, పెయింటింగ్ తదితర రంగాల్లో ప్రావీణ్యం సాధించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అన్నారు. నల్లగొండ జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో 2025- 26 జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను శనివారం ఆయన కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి మాట్లాడారు. నేటి యువత తమ ప్రతిభను వెలికి తీసి దేశ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలన్నారు. స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. యువత శక్తివంతంగా ఉంటే దేశం శక్తివంతంగా ఉంటుందన్నారు.
గమ్యస్థానం చేరుకునే దాకా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. వివేకానందుడు ప్రపంచానికి భారతీయ సంస్కృతి, విలువలు, యువత శక్తిని గుర్తు చేసిన మహానుభావుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలీ, కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి కాలేజీ ప్రిన్సిపాల్ ఉపేందర్, ఒకేషనల్ ప్రిన్సిపాల్ రాకేంద్, నాగార్జున డిగ్రీ ఓపెన్ కళాశాల ప్రిన్సిపాల్ బొజ్జ అనిల్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ మనిషా సింగ్, బాలు పాల్గొన్నారు.