వ్యవసాయంలో ప్రపంచంతో పోటీపడి ఆదాయం పొందాలంటే అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు శాస్త్ర సాంకేతికను ఉపయోగించుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. డిండి మండల కేంద్రంలోని విత్తనోత్పత్తి క్షేత్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహించి అభిప్రాయాలు పంచుకున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను సద్వినియోగం చేసుకుని రైతులు అధిక దిగుబడి సాధించాలన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగుచేసి లాభాలు గడించాలని ఆకాంక్షించారు. అంతకుముందు విత్తనోత్పత్తి క్షేత్రంలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని వ్యవసాయ శాఖ వివిధ రకాల విత్తనాలు, మొలకలతో రూపొందించిన సీఎం కేసీఆర్ చిత్రాన్ని ఎమ్మెల్యే రవీంద్రకుమార్తో కలిసి వీక్షించారు. స్వాతంత్య్ర పోరాట యోధుల త్యాగాలు నేటి తరానికి తెలియజెప్పాలనే సీఎం కేసీఆర్ 2 వారాల పాటు వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారని ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
డిండి, ఆగస్టు 23 : వ్యవసాయంలో అధిక దిగుబడులు పొందేందుకు రైతులు సాంకేతికను ఉపయోగించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని వ్యవసాయ విత్తనోత్పత్తి క్షేత్రంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రైతులతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సంకేతికతను ఉపయోగించుకొని పంట ఉత్పత్తి పెంపొందిచుకోవాలని సూచించారు. ప్రపంచంలో ఆహారపు అవసరాలు తీర్చే బాధ్యత రైతులది అని పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ రంగంలో మార్పులు వచ్చినట్లు వ్యవసాయంలోనూ వనరులను వాడుకొని అభివృద్ధి సాధించాలని సూచించారు. వ్యవసాయంలో రెండో అతిపెద్ద వ్యవసాయ భూమి ఉన్న దేశం మనది అని అన్నారు.
మన దేశంలో 3.25 కోట్ల ఎకరాల్లో పత్తి సాగు చేస్తుండగా, అమెరికాలో 85 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తూ భారతదేశంలో ఉత్పత్తి అయ్యే పత్తితో సమానంగా దిగుబడులు సాధిస్తున్నట్లు తెలిపారు. చైనాలో ఎకరానికి 100 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి సాధిస్తుండగా, తెలంగాణలో అత్యధికంగా 40 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే పండిస్తున్నట్లు తెలిపారు. ఉత్పాదకత పెంచేందుకు పంటల సాగు విధానంపై కేంద్రం అనువైన విధానం అమలు చేయాలని కోరారు. ప్రపంచ మార్కెట్కు అనుగుణంగా పంటలను సాగు చేసేందుకు రైతులకు కావాల్సిన శిక్షణ ఇవ్వాల్సి ఉందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయంలో కూలీల కొరత తీర్చేందుకు ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటను విక్రయించేందుకు ఎదురు చూసే దుస్థితి దేశంలో ఉన్నదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయం అభివృద్ధి చేసేందుకు 65 లక్షల మంది రైతులకు 58 వేల కోట్ల రూపాయలు రైతుబంధు, రైతు బీమాకు రూ.7వేల కోట్లు, రూ.10 వేల కోట్లు పంటల కొనుగోళ్లకు, రూ.3.50 లక్షల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఖర్చు చేసినట్లు తెలిపారు. అంతకుముందు డిండి వ్యవసాయ విత్తన ఉత్పత్తి క్షేత్రంలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని వ్యవసాయ శాఖ వివిధ రకాల విత్తనాలతో ఏర్పాటు చేసిన చిత్రపటాలను వీక్షించారు. ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ.. డిండిలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని మంత్రి నిరంజన్రెడ్డిని కోరారు. అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మమ్మ, వైస్ చైర్మన్ జంగారెడ్డి, ఎంపీపీ సునీతాజనార్దన్రావు, సర్పంచ్ సాయమ్మ, రైతుబంధు సమితి కన్వీనర్ వెంకటేశ్వర్రావు, ఎంపీటీసీలు వెంకటయ్య, రాధిక, అడిషనల్ డైరెక్టర్ విజయ్కుమార్, జేడీఏ సుచరిత, తాసీల్దార్ ప్రశాంత్, ఎంపీడీఓ డానియేల్, ఏడీఏ వీరప్ప, ఏఓలు పాల్గొన్నారు.