యాదగిరిగుట్ట, జనవరి24 : యాదగిరిగుట్ట దివ్యక్షేత్రంలో లక్ష్మీనరసింహ స్వామి నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రాగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవను నిర్వహించారు. తిరువారాధన, ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసి సహస్రనామార్చన, అమ్మ వారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. సుదర్శన నారసింహహోమం పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో సాగింది. ఉదయం ఆలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ సుదర్శ నారసింహ హవనం జరిపారు. వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి గజవాహన సేవ చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా సాగింది. భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణాన్ని వీక్షించారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణమూర్తులకు పలు దఫాలుగా సువర్ణపుష్పార్చన కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. సాయంత్రం స్వామి, అమ్మవార్ల తిరువీధి సేవ, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలను ఘనంగా నిర్వహించారు. స్వామివారిని సుమారు 15 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలుపుకుని స్వామివారి ఖజానాకు రూ. 19,90,260 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి సేవలో జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ సంతోష్ కుటుంబ సమేతంగా పాల్గొని తరించారు. మంగళవారం ఉదయం కొండపైకి చేరిన ఆయన మొదటగా స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారి వారికి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి 20 రోజుల హుండీల ఆదాయం రూ. కోటిన్నర దాటిందని ఆలయ ఈఓ ఎన్. గీత వెల్లడించారు. మంగళవారం యాదాద్రి కొండకింద గల సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో హుండీలను లెక్కించామని, నగదు 1,84,84,891 ఆదాయం వచ్చిందని తెలిపారు. ఇందులో 144 గ్రాముల మిశ్రమ బంగారం, 2 కిలోల 850 గ్రాములు మిశ్రమ వెండి సమకూరిందన్నారు. అమెరికా దేశానికి చెందిన 1,024 డాలర్లు, యూఏసీకి చెందిన 210 దిరామ్స్, ఆస్ట్రేలియాకు చెందిన 145 డాలర్లు, ఇంగ్లాండ్కు చెందిన 20 పౌండ్స్, కెనడాకు చెందిన 300 డాలర్లు, ఒమాన్కు చెందిన ఒక బైసా, సింగపూర్కు చెందిన 15 డాలర్లు స్వామివారికి సమకూరాయని చెప్పారు.