యాదగిరిగుట్ట, మే 27 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొన్నది. శనివారంతోపాటు వేసవి సెలవులు కావడంతో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. దాంతో ఆలయ మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల వద్ద భక్తుల కోలాహలం నెలకొన్నది. స్వామివారి కల్యాణోత్సవంలో 108 జంటలు పాల్గొని కల్యాణతంతును తిలకించారు. ఆలయ ముఖ మండపంలో జరిగిన సువర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారిని సుమారు 30 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ధర్మదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామివారి నిత్యోత్సవాలు తెల్లవారుజాము నుంచే మొదలయ్యాయి.
ఉదయం సుప్రభాత సేవతో నారసింహుడిని మేల్కొలిపిన అర్చకులు తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన జరిపారు. నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా సాగింది. ఉదయం స్వామివారికి సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవ నిర్వహించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పు అభిముఖంగా స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణోత్సవం జరిపారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. ఆలయ ఖజానాకు రూ.37,54,308 ఆదాయం సమకూరినట్లు ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామివారిని దర్శించుకున్న వివిధ రాష్ర్టాల పోలీస్ అధికారులు
స్వామివారిని రాష్ట్ర డీఐజీ రవిశంకర్, జార్ఖండ్ డీఐజీ విజయలక్ష్మి, బీహార్ ఏసీబీ డీఐజీ ప్రేమలత, నాగాలాండ్ ఐజీ రూప, సిమ్లాకు చెందిన ఎస్ఐబీ విభాగం డీఐజీ ఆమొంగ్లా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ పర్యవేక్షకుడు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
సంస్కృత కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు
లక్ష్మీనరసింహస్వామి సంస్కృత విద్యా పీఠంలో 2023-24 విద్యా సంవత్సరానికి వివిధ సంస్కృత కోర్సుల్లో ప్రవేశాలను ప్రారంభించినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. ప్రథమ కక్ష్య సంస్కృతానికి 5వ తరగతి, ద్వితీయ కక్ష్యకు 6వ తరగతి, తృతీయ కక్ష్యకు 7వ తరగతి, చతుర్థ కక్ష్యకు 8వ తరగతి, పంచమ కక్ష్య(సంస్కృత ఎంట్రన్స్)కు 9వ తరగతి, పీడీసీ( ప్రీడీ కోర్సు 2 సంవత్సరాలు) 10వ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ తరగతులకు ప్రవేశ అర్హత ఉన్నట్లు చెప్పారు. ప్రవేశానికి ఆగస్టు 31 వరకు గడువు ఉంటుందన్నారు. వివరాలకు దేవస్థాన కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.