దగిరిగుట్ట, ఏప్రిల్19: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వయంభూమూర్తులకు నిత్యారాధనలు అత్యంత వైభవంగా సాగాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వయంభూ నారసింహస్వామిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. ప్రధానాలయంలో నిజాభిషేకం జరిపారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా సాగింది. గంటన్నరపాటు అర్చక బృందం శాస్ర్తోక్తంగా కల్యాణతంతు జరిపించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుసూ హోమం జరిపారు. స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. అనంతరం లక్ష్మీసమేతుడైన కల్యాణమూర్తులను ముస్తాబు చేసి భక్తులకు అభిముఖంగా అధిష్టించి నిత్యకల్యాణ తంతు నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి సేవ, దర్బార్ సేవ చేపట్టారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 8 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అన్ని విభాగాకలు కలిపి స్వామివారి ఖజానాకు రూ.11,48,286 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామివారి ప్రధానాలయ ముఖ మండపంలో ధ్వజస్తంభం చుట్టూ అద్దాల రక్షణ గోడను అమర్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో స్వర్ణంతో తీర్చిదిద్దిన ధ్వజస్తంభానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యగా రక్షణ గోడను నిర్మించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ధ్వజస్తంభాన్ని పూర్తిగా బంగారు తాపడంతో నిర్మించారు. 1,785 గ్రాముల మేలిమి బంగారంతో ప్రత్యేక స్వర్ణతాపడం చేపట్టారు. బంగారు తాపడంపై పుష్పాలు, సింహం ఆకృతులు, ఉపపీఠాలు వంటి ఆకృతులు వాటిలో లతలు, పుష్పాలు చెక్కారు. భక్తులు బంగారు తాపడాన్ని తాకడంతో బరువు తగ్గుతుడటంతో ఆలయ అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ధ్వజస్తంభానికి చుట్టూ అద్దాలతో రక్షణగోడను నిర్మించారు.