యాదగిరిగుట్ట, జనవరి 20 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి నిత్య తిరుకల్యాణం శాస్ర్తోక్తంగా జరిగింది. శనివారం ఉదయం స్వామివారికి సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవ నిర్వహించారు. వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హవనం జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు కల్యాణోత్సవ సేవ జరిపారు. స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణ తంతు జరిపారు.
విశ్వక్సేనారాధన, స్వస్తీవాచనం కార్యక్రమాలతో కల్యాణాన్ని ప్రారంభించారు. సుమారు గంటన్నరపాటు సాగిన వేడుకల్లో భక్తులు పాల్గొని కల్యాణోత్సవాన్ని తిలకించారు. అనంతరం భక్తులు నారసింహుడిని దర్శించుకున్నారు. స్వామివారి నిత్యోత్సవాలు తెల్లవారుజాము నుంచే మొదలయ్యాయి. ఉదయం సుప్రభాత సేవతో నారసింహుడిని మేల్కొలిపిన అర్చకులు తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన జరిపారు.
సాయంత్రం స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం నిర్వహించారు. భక్తులు దర్బార్ సేవలో పాల్గొని తరించారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు వైభవంగా జరిగాయి. స్వామివారిని సుమారు 16 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి ఆలయ ఖజానాకు రూ.27,69,587 ఆదా యం సమకూరినట్లు ఈఓ రామకృష్ణారావు తెలిపారు.
స్వామివారి కల్యాణంలో జిల్లా అదనపు న్యాయమూర్తి మారుతీదేవి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సీఎంఓ చంద్రశేఖర్రెడ్డి స్వామివారి సేవలో పాల్గొని తరించారు. కుటుంబసమేతంగా ఆలయానికి చేరుకున్న వారు నిత్య తిరుకల్యాణంలో పాల్గొన్నారు. అనంతరం పంచనారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు సంప్రదాయ స్వాగతం పలికి దర్శనం అనంతరం స్వామివారి వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు ప్రసాదం అందజేశారు.