యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 28 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామికి బుధవారం సాయంత్రం దర్బార్ సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా అలంకరించి ప్రధానాలయం ముఖ మండపంలో వేంచేపు చేసి నాలుగు వేదాలు పారాయణం చేసి స్వామివారి స్వస్తిమంత్రార్థ వంటి మంత్రాలతో శాంతింపజేశారు. స్వామివారికి నక్షత్ర హారతిని ఇచ్చి మంత్రపుష్ప నీరాజనం చేశారు. సుమారు అరగంటపాటు సాగిన సేవలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఆరగింపు చేపట్టారు. ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు.
నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసి సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామివారికి సహస్రనామార్చన చేసి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. ప్రధానాలయం ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా సువర్ణ పుష్పార్చన జరిపించారు. సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా చేపట్టారు.
వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ అర్చకులు హోమం జరిపారు. ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి గజ వాహనంపై వేంచేపు చేసి కల్యాణోత్సవ సేవ నిర్వహించారు. కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణ తంతును చేపట్టారు. లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ గంటన్నరకుపైగా నిత్యతిరు కల్యాణ తంతును జరిపారు. స్వామివారి కల్యాణంలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి సేవ చేపట్టారు.
రాత్రి తిరువారాధన చేపట్టి, స్వామివారికి తులసి సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన జరిపారు. పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామికి నిత్యారాధనలు వైభవంగా సాగాయి. సంకష్టహర చతుర్థి సందర్భంగా శ్రీపర్వత వర్ధనీసమేత రామలింగేశ్వరస్వామివారి ఆలయంలో గణపతి హోమం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 6 వేల మంది భక్తులు లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.13,48,787 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో రామకృష్ణారావు తెలిపారు.