యాదగిరిగుట్ట, మార్చి 7 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహోత్సవాల ఆహ్వాన తొలి పత్రికను స్వయంభు పంచనారసింహస్వామికి ఆలయ అర్చకులు అందజేశారు. ఈ నెల 11 నుంచి 21 వరకు బ్రహోత్సవాలను ప్రశాంతంగా జరిగేలా చూడు తండ్రి అని వేడుకున్నారు. గురువారం బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక యాదగిరిగుట్టకు చేరుకోగా తొలి పత్రికకు అర్చకులు మంగళగిరి నరసింహమూర్తి బృందం ప్రత్యేక పూజలు చేసింది. అనంతరం వీవీఐపీ, వీఐపీలను ఆహ్వానించేందుకు ఆలయ అధికారులు బయల్దేరారు.
లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం ఈసారి ఉత్తర మాఢవీధుల్లో జరుగనున్నది. గతేడాది తూర్పు మండపంలో నిర్వహించగా స్థలం సరిపోలేదని ఈ సారి ఉత్తర ప్రాంతంలోనే కల్యాణోత్సవం జరిపేందుకు దేవస్థాన అధికారులు నిర్ణయించారు. కల్యాణోత్సవ మండపం, వీవీఐపీ, వీఐపీ, అర్చకులు, దేవస్థాన సిబ్బంది కూర్చునేందుకు వీలుగా ప్రత్యేక గ్యాలరీల ఏర్పాటు చేయడంలోఅధికారులు నిమగ్నమయ్యారు. గురువారం ఉత్తర మాఢవీధుల్లో మార్కింగ్ చేశారు. రథోత్సవం కోసం రథశాలలో ఉన్న రథానికి మరమ్మతులు నిర్వహించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు స్వామివారి ప్రధానాలయం ముస్తాబవుతున్నది. ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని గురువారం ఆలయ అధికారులు, సిబ్బంది ప్రారంభించారు. ఆలయ ముఖ మండపం, ఉపాలయాలు, ధ్వజస్తంభం, ఉచిత, వీఐపీ క్యూలైన్లను శుద్ధి చేశారు. నేడో, రేపో ప్రధానాలయ తిరుమాఢవీధులు, పురవీధులు, సప్తతల, పంచతల, త్రితల రాజగోపురాలు, అష్టభుజి ప్రాకార మండపాలు, క్యూలైన్ కాంప్లెక్స్ను ఫైరింజన్ సాయంతో శుద్ధి చేయనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.