దగిరిగుట్ట, మార్చి 16 : యాదగిరి లక్ష్మీనరసింహ స్వామికి వెండి మొక్కు జోడు సేవను గురువారం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి గరుఢ వాహనంపై, అమ్మవారిని తిరుచ్చిపై వేంచేపు చేసి తిరుమాఢ వీధుల్లో ఊరేగించారు. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామిని సుప్రభాతంతో మేల్కొల్పి తిరువారాధన, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామి వారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరు కల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిపించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు ఉత్సవమూర్తులను ద్యివ మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవ నిర్వహించారు.
అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణతంతును చేపట్టారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపించారు. కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీక్షించారు. ప్రధానాలయ ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా భక్తులకు సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు.
సాయంత్రం వేళలో స్వామివారికి తిరువీధి సేవ, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చనలు చేశారు. పాతగుట్టలో స్వామివారికి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 8 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.12,51,764 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.