యాదాద్రి, డిసెంబర్12: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణాన్ని అర్చకులు సోమవారం ఘనంగా జరిపించారు. కల్యాణమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి ప్రధానాలయ మొద టి ప్రాకార మండపంలో సుమారు గంటన్నర పాటు కల్యాణోత్సవం జరిపించారు. కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీక్షించారు. స్వామి వారికి నిత్యోత్సవాలు తెల్లవారుజామునే ప్రారంభమయ్యాయి. ఉదయం 3.30గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పి, తిరువారాధన, స్వామి, అమ్మవార్లకు బాలబోగం నిర్వహించారు. స్వయంభువుడికి నిజాభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉదయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు సుదర్శన ఆళ్వారులకు కొలుస్తూ హోమం చేశారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను గరుఢ, తిరుచ్చీ వాహనాలపై వేంచేపు చేసి ఆలయ మాఢవీధుల్లో ఊరేగించారు. రాత్రి దర్బార్ సేవ, నివేదన, శయనోత్సవం సేవను ఘనంగా నిర్వహించారు. రామలింగేశ్వర కుటుంబంతో పాటు ఆలయంలో స్పటిక లింగేశ్వరుడికి ప్రభాతవేళ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని సుమారు గంటన్నర పాటు నిర్వహించారు. సుమారు 17వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.36,23, 704 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. శ్రీవారిని కాశీకి చెందిన అఘోర గజేంద్ర గోస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
టూరిజం భవనానికి ఆధ్యాత్మిక మెరుగులు
యాదాద్రి కొండపైన గల టూరిజం హరిత భవనాన్ని ఆధ్యాత్మిక మెరుగులతో తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం అర్చకులు, అలయ, టూరిజం అధికారులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. భవనాన్ని పునరుద్ధరించి, ఆధ్యాత్మిక మెరుగులు తీర్చిదిద్దనున్నారు. యాదాద్రి లక్ష్మీనారసింహులతో పాటు పంచ నారసింహులు, వివిధ దేవతామూర్తుల రూపాలతో భవనాన్ని తీర్చిదిద్దనున్నారు. పూర్తి ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా కాకతీయ పిల్లర్లు, మామిడి తోరణాలు, వివిధ రకాల దేవతాకృతులతో హరిత భవనం ముస్తాబుకానుంది. కార్యక్రమంలో డీఈఓ దోర్భల భాస్కర్ శర్మ, టూరిజం జీఎం జంగయ్య, సూపర్వైజర్ శ్రీనివాస్నాయక్, అర్చకులు పాల్గొన్నారు.