యాదాద్రి, నవంబర్ 13 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. కార్తిక మాసంతో పాటు మూడో ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మాఢ వీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపం భక్తులతో కిక్కిరిసింది. వీఐపీ, బ్రేక్ దర్శనాల్లో భక్తులు అధిక సంఖ్యలో 2,317మంది పాల్గొన్నారు. ధర్మ దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూ కాంప్లెక్స్ మూడు అంతస్తులతో పాటు క్యూలైన్లు నిండిపోయాయి. వీవీఐపీ దర్శనానికి వచ్చిన భక్తులు తూర్పు రాజగోపురం నుంచి ఈశాన్య మాఢవీధులు గుండా లిఫ్టు వరకు క్యూ కట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వీఐపీ దర్శనాలతో రూ. 22,65,000 ఆదాయం సమకూరింది. దీంతో ఇరు దర్శనాలకు భారీ ఆదాయం సమకూరింది. కొండపైకి వాహనాల రద్దీ కొనసాగింది. పార్కింగ్ ప్రాంతంతో పాటు కొండపై వివిధ ప్రాంతాల్లో వాహనాలు రద్దీగా కనిపించాయి. స్వామి వారి ధర్మదర్శానికి 8గంటలు, వీఐపీ దర్శనానికి 6గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు.
ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు నిర్వహించే సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. స్వామి, అమ్మవార్ల నిత్యతిరుకల్యాణోత్సవం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్తిక మాసం సందర్భంగా కొండకింద వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 1,681మంది దంపతులు వ్రత పూజల్లో పాల్గొన్నారు. స్వామివారిని సుమారు 95వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.1,09,82,446 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వామివారి ఖజానాకు రికార్డుస్థాయిలో ఆదాయం రావడం మొదటిసారి అని ఆలయాధికారులు తెలిపారు. పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకోవడం ఇదే ప్రథమమని తెలిపారు. భక్తుల రద్దీ నేపథ్యంలో వీవీఐపీ టికెట్టుపై ఇచ్చే లడ్డూ ప్రసాదాలను తాత్కాలికంగా మూసివేసినట్లు ఆలయాధికారులు తెలిపారు. అంతకుముందు స్వామి అమ్మవార్లకు నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు.
నేడు కార్తిక తులసీ దామోదర వ్రతాలు
కార్తిక మాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం సోమవారం ఉదయం 11గంటల నుంచి 12.30గంటల వరకు కొండ కింద వ్రత మండపంలో కార్తిక తులసీ దామోదర వ్రతా లు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. రూ.516 టికెట్తో భక్తులు వ్రతాల్లో పాల్గొనేందుకు వీలు కల్పించనున్నామని తెలిపారు. ఒక్కరోజు జరిగే ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.