యాదాద్రి, జూలై 7 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అర్చకులు గురువారం నిత్యపూజలు కోలాహలంగా నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం చేశారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయ ఉత్తర దిశ లోపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు.
స్వామివారి వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవ ఘనంగా చేపట్టారు. రాత్రి 7గంటలకు స్వామివారి తిరువారాధన చేపట్టి, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. కొండపైన ఉన్న పర్వతవర్దినీ సమేత రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన చేశారు. కొండ కింద లక్ష్మీపుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానం ఆచరించి సంకల్పంలో పాల్గొన్నారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన చేశారు. పాతగుట్ట ఆలయంలో స్వామివారి నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 10వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. స్వామి ఖజానాకు రూ.12,20,140 ఆదాయం సమకూరినట్లు ఈఓ గీత తెలిపారు.
యాదాద్రీశుడికి 30తులాల బంగారం
యాదాద్రీశుడి దివ్యవిమాన గోపురం స్వర్ణ తాపడానికి దాతల నుంచి మంచి స్పందన వస్తుంది. రాష్ట్ర ప్లానింగ్ కమిటీ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ 30తులాల బంగారం సమర్పించారు. ఆయన సతీమణి బోయినపల్లి మాధవి ఈఓ ఎన్.గీతకు గురువారం అందించారు.