యాదాద్రి, జూలై 6 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరు కల్యాణోత్సవాన్ని అర్చకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. స్వామి నిత్యపూజలు వేకువజామున 3.30గంటలకు ప్రారంభమయ్యాయి. స్వయంభువులకు ఆరాధనలు జరిపి పంచామృతాలతో అభిషేకించి, తులసీ అర్చనలు చేశారు. లక్ష్మీనరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం స్వయంభూ ఆలయ ఉత్తర దిశ లోపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. అనంతరం నిత్య తిరుకల్యాణోత్సవం జరిపించారు. అనంతరం దేవేరులను గజవాహనంపై పురవీధుల్లో ఊరేగించారు.
మొదటగా స్వామివారికి సుదర్శన నారసింహ హోమం జరిపారు. సాయంత్రం వేళ స్వామికి తిరువారాధన, అలంకార జోడు సేవలు, దర్బార్ సేవ నిర్వహించారు. సువర్ణ పుష్పార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి సహస్రనామార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామికి సహస్రనామార్చనలు చేశారు. పర్వతవర్దినీ సమేత రామలింగేశ్వరాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయ ప్రకారం నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యారాధనలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీవారి ఖజానాకు రూ.14,16,110 వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.