యాదాద్రి, జూన్ 28 : యాదాద్రి స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్యోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 3.30గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం స్వామికి తిరువారాధన చేపట్టి, ఉదయం ఆరగింపు నిర్వహించారు. ఉదయం 5.15గంటల నుంచి 6.15గంటల వరకు స్వామికి నిజాభిషేకం కోలాహలంగా నిర్వహించారు. అనంతరం స్వామికి తులసి సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. అనంతరం భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. నిత్యపూజల్లో భాగంగా ప్రధానాలయంలోని ఉత్తర దిశలోని మొదటి ప్రాకార మండపంలో లక్ష్మీనర్సింహుల నిత్యకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిపించారు. తొలుత సుదర్శన నారసింహ హోమం చేశారు. సాయంత్రం వేళ ప్రాకారంలో వెండి మొక్కు జోడు సేవోత్సవం, దర్బార్ సేవలు సంప్రదాయంగా నిర్వహించారు. అలంకార సేవోత్సవంలో పాల్గొన్న భక్తులకు అర్చకులు స్వామి, అమ్మవార్ల ఆశీస్సులు అందించారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులచే నిర్వహించే సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీక్షాపరుల మండపంలో సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్య పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి.
యాదాద్రీశుడి హుండీల ఆదాయం రూ.68,55,927
యాదాద్రి కొండపై గల హరిత హోటల్లో ఏడు రోజుల హుండీల ఆదాయాన్ని లెక్కించగా రూ.68,55,927 ఆదాయం వచ్చినట్లు ఈఓ ఎన్.గీత తెలిపారు. మిశ్రమ బంగారం 96గ్రాములు, మిశ్రమ వెండి కిలో 200 గ్రాములు వచ్చిందని తెలిపారు. దీంతో పాటు అమెరికాకు చెందిన 426డాలర్లు, సింగపూర్కు చెందిన 6పౌండ్స్, యూఏఈకి చెందిన 325 థిరామ్స్, ఆస్ట్రేలియాకు చెందిన 10 డాలర్స్, కెనడాకు చెందిన 30 డాలర్లు, మలేషియాకు చెందిన 1 రింగ్గిట్ సమకూరినట్లు తెలిపారు.
క్షేత్రపాలకుడికి ఆకుపూజ
యాదాద్రి సన్నిధి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేశారు. క్యూ కాంప్లెక్స్లోని ఆలయంలో హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించి తమలపాకులతో అర్చించారు. వేదమంత్రాల మధ్య జరిగిన పూజల్లో పలువురు భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. తమలపాకులతో అర్చించి లలితాపారాయణం చేశారు. ఆంజనేయ స్వామికి ఇష్టమైన వడ పప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.