కలెక్టర్ పమేలా సత్పతి
మోత్కూరు, జూన్ 24 : ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మోత్కూరు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఆవరణలోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన పోషకాహార వారోత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు, వైద్యుల సలహాలు పాటించి ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనివ్వాలన్నారు. తద్వారా ఆరోగ్యకరమైన సమాజం రూపుదిద్దుకుంటుందన్నారు. ఈ సందర్భంగా 35 మంది గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో ఇన్చార్జి పీడీ చంద్రకళ, మున్సిపల్ వైస్ చైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య, కౌన్సిలర్ పురుగుల వెంకన్న, సీడీపీఓ జ్యోత్స్న, సూపర్వైజర్ మంగమ్మ పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
గుండాల : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మండలంలోని తుర్కలశాపురం ప్రాథమికోన్నత పాఠశాల, భవిత కేంద్రాన్ని శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులతో బోర్డుపై లెక్కలు చేయించి ప్రశంసించారు. విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ
ఆలేరు : ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ పమేలా సత్పతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి అన్ని వార్డులు, డయాలసిస్ సెంటర్ను పరిశీలించారు. ఆమె వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ క్రాంతికుమార్ ఉన్నారు.
భువనగిరి కలెక్టరేట్ : పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. కలెక్టరేట్లో ఉపాధ్యాయ సంఘాలు, ఎంఈఓలు, సెక్టోరియల్ అధికారులతో సమీ క్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థుల అభివృద్ధి, అభ్యున్నతికి పాటుపడటం సంతోషంగా ఉందన్నారు.