యాదాద్రి, జూన్ 13 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం శ్రీపర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ప్రధానాలయ ముఖ మండపంలోని స్పటిక లింగేశ్వరుడికి అభిషేకం జరిపారు. సోమవారం కావడంతో గర్భాలయంలోని లింగేశ్వర కుటుంబంతోపాటు ఆలయంలో నూతనంగా ప్రతిష్ఠించిన స్పటిక లింగానికి అర్చకులు, పురోహితులు ప్రభాతవేళ మహన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని జరిపారు. రామలింగేశ్వరుడిని ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకించారు. ఉపాలయాల్లో వెలిసిన సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలను అభిషేకాలతో అర్చించారు. శివాలయం ప్రధాన పురోహితుల ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ జరిపారు.
వైభవంగా నిత్య పూజలు
లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్ల నిత్య పూజలు వైభవంగా జరిగాయి. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవను నిర్వహించారు. తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు.
అనంతరం స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం భక్తులకు కల్పించారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామివారి సువర్ణపుష్పార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిపారు.
కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలను అత్యంత వైభవంగా నిర్వహించారు. యాదాద్రి కొండకింద పాతగోశాల వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు.
అన్ని విభాగాలను కలుపుకొని శ్రీస్వామివారి ఖజానాకు రూ.21,99,990 ఆదాయం సమకూరిందని ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు తెలిపారు.