యాదాద్రి, జూన్11: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో శనివారం స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. వేకువజామునే స్వయంభువులను కొలిచిన అర్చకులు ప్రధానాలయంలో స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ ముఖ మండపంతో 108 కలశాలకు పూజలు చేశారు. పంచసూక్త పఠనంతో హోమం నిర్వహించి స్వామివారిని అభిషేకించారు. తులసీ దళాలతో సహస్ర నామార్చనలు జరిపారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను రథసేవలో పురవీధుల్లో ఊరేగించారు. స్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా భక్తులు వేకువజామునే కొండచుట్టూ గిరి ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.
స్వామివారి సేవలో తరించిన భక్తజనం..
యాదాద్రి దివ్యక్షేత్రం భక్తులతో సందడిగా మారింది. స్వామివారి సేవలో భక్తులు పాల్గొని తరించారు. స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. క్యూలైన్లు, మాఢ వీధులు, ప్రసాద విక్రయశాలలో భక్తుల సందడి నెలకొంది. స్వయంభువులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. ఉదయం మూడున్నర గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు స్వామిని ఆరాధిస్తూ పూజలు చేశారు. తిరువారాధన, బాలభోగం, నిజాభిషేకం నిర్వహించారు.
స్వామి, అమ్మవార్లకు తులసీ సహస్రనామార్చనలు, ఆంజనేయ స్వామికి సహస్ర నామార్చనలు చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి సహస్ర నామార్చన, వెండి మొక్కు జోడు సేవలను వైభవంగా జరిపారు. కొండకింద పాతగోశాల వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణస్వామి పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. పాతగుట్టలో స్వామివారి నిత్యారాధనలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటకంగా కొనసాగాయి. స్వామివారి ఖజనాకు రూ.35,36,577 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
యాదాద్రి సన్నిధిలో ఉప్పల్ ఎమ్మెల్యే..
ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాశ్రెడ్డి కుటుంబ సమేతంగా యాదాద్రీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు స్వామివారి ప్రసాదం అందజేశారు.