నీలగిరి, జూన్ 6: సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ.85 వేలు పోగొట్టుకున్న మహిళ సొమ్మును జిల్లా సైబర్ క్రైం సిబ్బంది రికవరీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ పట్టణంలోని గొల్లగూడ ప్రాంతానికి చెందిన నాంపల్లి వరలక్ష్మికి ఏప్రిల్ 27న అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి మేము ప్రభుత్వ దవాఖాన నుంచి ఫోన్ చేస్తున్నాం. మీకు సర్జరీ అయింది కదా మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు వస్తాయి. నేను పంపిన లింక్ను క్లిక్ చేయండి అని చెప్పారు. దాంతో సదరు మహిళ లింక్ను క్లిక్ చేసింది. వెంటనే తన అకౌంట్లో ఉన్న రూ. 85 వేలు ఖాతా నుంచి మాయమయ్యాయి. ఆందోళన చెందిన మహిళ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు రూ.85 వేలు రికవరీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సోమవారం బాధితులను కార్యాలయానికి పిలిపించి వారి ఖాతా నుంచి వెళ్లిన డబ్బులు రికవరీ చేసిన విధానాన్ని వివరించారు. డబ్బులు పోగొట్టుకున్న మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిన బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేసి డబ్బులు డ్రా కాకుండా చూశారు. అనంతరం డబ్బులు డ్రా చేయించి మహిళకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింకులు, మెసేజ్లు క్లిక్ చేయకూడదని సూ చించారు. ఎవరైనా ఇలాంటి మోసానికి గురైతే వెంటనే హెల్ప్లైన్ నంబర్ 1930 లేదా 155260ను సంప్రదించాలని సూచించారు. డబ్బులు రికవరీ చేసిన క్రైమ్ ఎస్ఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ రియాజ్, కానిస్టేబుల్ మొక్షిద్ను ఎస్పీ అభినందించారు.