యాదాద్రి భువనగిరి, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మారుతున్న పరిస్థితులు, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తరుణంలో పెరుగుతున్న ఆయిల్ ధరలతోపాటు వినియోగం పెరిగిన కారణంగా విదేశాల నుంచి ఇబ్బడిముబ్బడిగా జరుగుతున్న దిగుమతులను అరికట్టడానికి రైతులను ఆయిల్ పామ్ తోటల సాగు వైపు మళ్లిస్తున్నది. ఇందుకోసం మొక్కలను ఉచితంగా అందజేయడంతోపాటు రాయితీలు కూడా కల్పిస్తుండటంతో తోటల సాగుకు జిల్లా రైతాంగం ముందుకొస్తున్నది. ఇప్పటికే జిల్లాలో కొన్నిచోట్ల సంప్రదాయకంగా పలువురు ఆయిల్ పామ్ సాగు చేపట్టారు.
70 శాతం దిగుబడులు విదేశాల నుంచే..
దేశంలో విదేశీ మారక నిల్వలు వినియోగించి దిగుమతి చేస్తున్న ఆహార పదార్థాల్లో ఆయిల్ వాటానే ఎక్కువగా ఉన్నది. ఇక్కడ ఆయిల్ కోసం ఉత్పత్తి అవుతున్న సీడ్స్తో కేవలం 30 శాతం డిమాండ్ మాత్రమే తీరుతోంది. మిగతా 70 శాతం ఆయిల్ నిల్వలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. విదేశాల నుంచి దిగుమతులు చేసుకుంటున్న వ్యవసాయ ఉత్పత్తుల్లో 40 శాతం ఆయిల్ ఉండగా అందులో 62 శాతం పామాయిల్ ఉంటోంది. ఈ లెక్కన పామాయిల్ సాగు పెంచడం వల్ల చాలావరకు దిగుమతులను తగ్గించుకునే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పామ్ సాగును పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నది.
మెండుగా ప్రోత్సాహకాలు
ఆయిల్ పామ్ సాగును పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తు న్నది. ఎకరాకు 50 నుంచి 57 మొక్కలు అవసరం ఉండగా ప్రస్తుతం వాటిని పూర్తి ఉచితంగా అందజేస్తున్నది. డ్రిప్ సిస్టమ్ కోసం ఓసీ, బీసీలకు 80 శాతం సబ్సిడీ, ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం సబ్సిడీ ఇస్తున్నది. పన్నెండున్నర ఎకరాల వరకు రైతులు ప్రభుత్వం నుంచి రాయితీలు పొందే అవకాశం ఉన్నది. పంట ఎదుగుదల కాలంలోనూ కొంత నగదును ప్రోత్సాహకంగా అందించనున్నది.
ఈ ఏడాది లక్ష్యం 6 వేల ఎకరాలు
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆయిల్పామ్ సాగు పట్ల రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే జిల్లాలో తుర్కపల్లి మండలకేంద్రంలో 4 ఎకరాల్లో, తుర్కపల్లి మండలం చిన్నలక్ష్మాపురంలో 10, వలిగొండ మండలం వేములకొండలో 14, సంస్థాన్ నారాయణపురం మండలం జనగామలో 5 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు సాగవుతున్నాయి. ఈ ఏడాది 6 వేల ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆయిల్ ఫెడ్ రైతులతో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మరోపక్క మోత్కూరు మండలం పాలడుగులో నర్సరీని ఏర్పాటు చేసి 4 లక్షల మొక్కలను పెంచుతున్నారు. ఆసక్తిగల రైతుల పేర్లను నమోదు చేసేందుకు ఆరుగురు ఫీల్డ్ ఆఫీసర్లను సైతం నియమించారు. రైతులకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేయడంతోపాటు, పండించిన పంటలను సైతం ఆయిల్ ఫెడ్ సంస్థనే కొనుగోలు చేసి ప్రాసెసింగ్కు పంపనుంది.
ఎకరాకు రూ. 2 లక్షల ఆదాయం
నీరు నిలువని లోతైన ఒండ్రు నేలలు, అధిక సేంద్రీయ పదార్థం కలిగి, నీరు తేలికగా ఇంకిపోయే గుణం కలిగి ఉండి, నీరు సమృద్ధిగా ఉన్న సారవంతమైన నేలల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తే 4 నుంచి 30 ఏండ్ల వరకు నిరంతర ఆదాయం పొందవచ్చు. నాలుగేళ్ల తర్వాత దిగుబడులు మొదలవుతాయి. ప్రస్తుతం మార్కెట్లో ఆయిల్ పామ్ గెలలకు టన్నుకు రూ. 23 వేల ధర ఉంది. ఈ లెక్కన ఎకరాకు రూ. 2లక్షల ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు. డ్రిప్ ద్వారా మొక్కలు ఎండిపోకుండా సమృద్ధిగా నీరందిస్తే దిగుబడులు మరింతగా వస్తాయంటున్నారు. మొదటి ఏడాది కొంత పెట్టుబడి కాగా రెండో ఏడాది నుంచి కాత వచ్చే వరకు పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. మూడేళ్ల వరకు మొక్కల మధ్య మొక్కజొన్న, మిరప, పూలు, పెసలు, మినుము, నువ్వులు, కూరగాయలను అంతరపంటగానూ సాగు చేసుకోవచ్చు. అకాల వర్షాలు, గాలి బీభత్సం వచ్చినా తోటలకు నష్టం ఉండదని, పశువులు, కోతులు కూడా పంటలను నష్టపర్చలేవని అధికారులు చెబుతున్నారు.
రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు దృష్టి సారించాలి
వరి వంటి పంటలతో పెద్దగా లాభాలు లేనందున రైతులు ఆయిల్ పామ్ వైపు దృష్టి సారించాలి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భారీగా ప్రోత్సాహకాలు అందిస్తున్నది. ఈ పంట మన ప్రాంతానికి కొత్త అయినా ఇక్కడి వాతావరణం, భూములు అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం నర్సరీలో 4 లక్షల మొక్కలను సిద్ధం చేస్తున్నాం. మొక్కలు నాటడం, సస్యరక్షణ చర్యలు, పంటల విక్రయాల వరకు ఆయిల్ ఫెడ్, ఉద్యానశాఖ అండగా ఉంటుంది. రైతులు సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే ఎకరాకు రూ. 2 లక్షల వరకు సంపాదించొచ్చు.
– కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్