యాదాద్రి భువనగిరి జిల్లా విభిన్న పంటలతోపాటు చేపల ఉత్పత్తిలోనూ ముందు వరుసలో నిలుస్తున్నది. జల లభ్యతతో గతేడాది లక్ష్యాన్ని మించి చేపలను దిగుబడి చేయగా ఈ సంవత్సరం మరింత సానుకూల పరిస్థితి నెలకొన్నది. రెండేండ్లతో పోలిస్తే ఈ ఏడాది చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2021-22 సంవత్సరంలో 13,675 టన్నుల చేపలు, 648 టన్నుల రొయ్యలు లభ్యమయ్యాయని జిల్లా మత్స్యశాఖ అధికారులు తెలిపారు.
– యాదాద్రి, జూన్ 23
జిల్లాలో బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాల్లో చెరువులు కాళేశ్వరం జలాలతో నిండుకుండలా మారాయి. గతేడాది విస్తారంగా కురిసిన వర్షాలతో జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు, వాగులు మత్తళ్లు దుంకాయి. వీటితోపాటు బీబీనగర్, భువనగిరి, వలిగొండ, రామన్నపేట మండలాల మీదుగా మూసీ నది ప్రవహించడం, ఆలేరు పెద్దవాగు, బిక్కేరు వాగుపై చెక్ డ్యామ్లను నిర్మించడంతో చేపల పెరుగుదలకు ఎంతగానో దోహదపడుతున్నాయి. జిల్లాలో 1,115 చెరువులు, కుంటలు ఉండగా ఐదేండ్లుగా సగం కన్నా ఎక్కువ చెరువుల్లో చేప పిల్లలు వదులుతున్నారు. వీటి సంతతి ప్రతియేటా పెరుగుతూ వస్తున్నది. ప్రస్తుతం వేసవి ముగిసే వరకు జిల్లాలోని చాలా చెరువుల్లో నీరు ఉండడంతో చేపలు మరింతగా వృద్ధి చెందనున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాలో 144 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో చాలా మంది చేపల ఆధారితంగా జీవనం సాగిస్తున్నారు. జిల్లాలో ఎర్రనేలలు, నల్లనేలలు, ఇసుక భూములు కలిగిన చెరువులు, కుంటలు ఉండటంతో వీటిల్లో పెరిగే చేపలు రుచికరంగా ఉంటున్నాయి. ఇక్కడి చేపలకు హైదరాబాద్తోపాటు వివిధ ప్రాంతాల్లో డిమాండ్ ఉంది. గత రెండేండ్లతో పోలిస్తే ఈ ఏడాది 13,675 టన్నులకు పైబడి చేపలు, 648 టన్నుల రొయ్యలు ఉత్పత్తి కాగా వీటిని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేశారు. రోహు, మ్రిగాల, కామన్ కార్ప్, కొర్రమీను తదితర రకాల చేపలు ఇక్కడ ఎక్కువగా పెరుగుతున్నాయి. రోసేన్ బర్గీ రకం రొయ్యలను పెంచుతున్నారు. వీటి అమ్మకాలు ఇటీవల భారీగా పెరిగాయి.
1,115 చెరువుల్లో 654 చెరువులకు జియో ట్యాగింగ్ చేయగా వీటిలో ఉచితంగా చేప పిల్లలను వదులుతున్నారు. వీటితోపాటు 2020-21లో రెండు చెరువుల్లో 2.10 లక్షలు, 2021-22లో 9 చెరువుల్లో 12.01 లక్షల రొయ్య పిల్లలను వదిలారు. ఇప్పటివరకు దాదాపు రూ.18.89 కోట్లతో మత్స్యకారులకు సబ్సిడీపై వలలు, వివిధ రకాల పరికరాలు, యంత్రాలు, మొబైల్ వాహనాలను ప్రభుత్వం ఇవ్వడంతో పెద్ద ఎత్తున ఉపాధి కలిగింది. ఇక కృత్రిమ చేపల చెరువులకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నది. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం, ఇతరులకు 40 శాతం చేపల చెరువుల నిర్మాణానికి ఇస్తున్నది. హేచరీలు, రొయ్యల యూనిట్లు, కేజీకల్చర్ ఏర్పాటుతోపాటు ట్రక్కులు, ఆటోలను కూడా ప్రభుత్వం అందిస్తున్నది.
జిల్లాలో పట్టిన చేపలను స్థానికంగా విక్రయించడంతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, కోల్కతా,
హైదరాబాద్ తదితర మార్కెట్లకు పంపిస్తారు. రోహు, మ్రిగాల, కామన్ కార్ప్ చేపలు కిలో రూ. 80 నుంచి రూ. 150 వరకు ఉన్నాయి. జిల్లాలో లోకల్ రకం చేపలు కొర్రమీను విత్తనాలు పోయకపోయినా ఇక్కడ పెరుగుతున్నాయి. జిల్లాలో పట్టిన చేపలను స్థానికంగా విక్రయించడంతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, కోల్కతా,
హైదరాబాద్ తదితర మార్కెట్లకు పంపిస్తారు. రోహు, మ్రిగాల, కామన్ కార్ప్ చేపలు కిలో రూ. 80 నుంచి రూ. 150 వరకు ఉన్నాయి. జిల్లాలో లోకల్ రకం చేపలు కొర్రమీను విత్తనాలు పోయకపోయినా ఇక్కడ పెరుగుతున్నాయి.
సంవత్సరం ఉత్పత్తి(టన్నుల్లో)
2019-20 8,917
2020-21 9,652
2021-22 13,675
సంవత్సరం చెరువులు చేప పిల్లలు(కోట్లలో)
2020-21 435 3.15
2021-22 1115 3.16