యాదాద్రి, జూన్ 23 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో నిత్య పూజలను అర్చకులు గురువారం కోలాహలంగా నిర్వహించారు. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన, ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం నిర్వహించారు. స్వామికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు.
ప్రధానాలయ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవం జరిపించారు. స్వామి వారి కల్యాణోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు, నూతన వధూవరులు పాల్గొని తరించారు. స్వామి వారి వెండి మొక్కు జోడు, దర్బార్ సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. రాత్రి 7గంటలకు స్వామి వారి తిరువారాధన చేపట్టి, స్వామికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. కొండపైన ఉన్న పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన పూజలు చేశారు.
కొండ కింద లక్ష్మీపుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానం ఆచరించి సంకల్పంలో పాల్గొన్నారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన చేపట్టారు. యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిపే సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాతగుట్ట ఆలయంలో స్వామివారి నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 13వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు చెప్పారు. అన్ని విభాగాలు కలిపి స్వామివారి ఖజానాకు రూ.16,45,357 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 1,82,300
వీఐపీ దర్శనం 67,500
వేద ఆశీర్వచనం 8,400
సుప్రభాతం 1,000
క్యారీబ్యాగుల విక్రయం 5,500
వ్రత పూజలు 1,20,800
కల్యాణకట్ట టిక్కెట్లు 32,800
ప్రసాద విక్రయం 7,85,400
వాహనపూజలు 12,300
అన్నదాన విరాళం 21,295
శాశ్వత పూజలు 27,500
సువర్ణ పుష్పార్చన 92,432
యాదరుషి నిలయం 70,800
పాతగుట్ట నుంచి 41,530
కొండపైకి వాహన ప్రవేశం 1,75,000