– కారుతో ఢీకొట్టి మహిళ గొంతు కోసిన గుర్తు తెలియని వ్యక్తులు
– ఏపూర్ గ్రామం నడిబొడ్డులో ఘటన
ఆత్మకూరు.ఎస్, అక్టోబర్ 21 : పట్టపగలు గ్రామం నడిబొడ్డు నుండి నడిచి వెళ్తున్న మహిళను గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టారు. కింద పడిన మహిళ గొంతును కత్తితో కోసి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలం ఏపూర్ గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొరివి భిక్షమమ్మ (39) తన భర్త కొరివి మల్లయ్యతో ఉన్న తగాదాను పెద్దల సమక్షంలో మాట్లాడి వస్తుంది. గ్రామం నడిబొడ్డున గుర్తు తెలియని వ్యక్తులు వీధిలో నడిచి వస్తున్న భిక్షమమ్మను వెనుక నుండి కారుతో ఢీకొట్టారు. ఆ వెంటనే కిందపడిన మహిళను దుండగులు కత్తితో భిక్షమమ్మ గొంతుపై దారుణంగా పొడిచారు. దీంతో భిక్షమమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.
మృతురాలు భిక్షమమ్మ కు తన భర్త కొరివి మల్లయ్యకు గత కొంతకాలంగా గొడవలు కొన సాగుతున్నాయి. మృతురాలి భర్త మల్లయ్య లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు భరత్ హైదరాబాదులో మెకానిక్ గా పని చేస్తుండగా చిన్న కుమారుడు ప్రవీణ్ సూర్యాపేటలో చికెన్ సెంటర్ లో పని చేస్తున్నాడు. భిక్షమమ్మకు ఇతరులతో సంబంధం ఉన్నదని భర్త మల్లయ్య, కుటుంబ సభ్యులు తరచూ అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెతో గొడవ పడేవారు. ఈ విషయమై పెద్దల వద్ద పలుమార్లు పంచాయతీ చేసి సర్ది చెప్పినట్లు సమాచారం. ఇటీవల సూర్యాపేటకు చెందిన దేశ గురువు భిక్షమమ్మతో చనువుగా ఉండడంపై కుటుంబ సభ్యులు ఇరువురిని మందలించారు.
తీరు మార్చుకోని భిక్షమమ్మను మంగళవారం తన భర్త మల్లయ్య పెద్దల సమక్షంలో మందలించేందుకు స్థానికంగా ఉన్న ఓ పార్టీ కార్యాలయానికి పిలిపించి మాట్లాడాడు. పెద్దలు ఇరువురిని సముదాయించి పంపించిన కొద్దిసేపటికే భిక్షమమ్మ దారుణ హత్యకు గురైంది. సమాచారం తెలుసుకున్న సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ రాజశేఖర్, ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్, క్లూస్ టీమ్తో సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని సూర్యాపేట హాస్పిటల్కు తరలించారు.