భువనగిరి కలెక్టరేట్, జూన్ 19 : ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సు రసాబాసగా మారింది. ఏండ్ల నుంచి ఉన్న సమస్యను పరిష్కరించి తమకు న్యాయం చేయాలంటూ రెవెన్యూ అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. భువనగిరి పట్టణ పరిధిలోని రాయగిరిలో గురువారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో వడాయిగూడెం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని 518 సర్వే నంబర్లోని వందలాది ఎకరాల భూమి పూర్తిగా భూదాన్ భూమిగా నమోదైందని ఆవేదన వ్యక్తం చేశారు. భూదాన్ భూమిగా నమోదు కావడంతో గ్రామస్తులుకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకం ఏదీ వర్తించక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వెంటనే రికార్డుల నుండి 518 సర్వే నంబర్ను మినహాయించి రైతులను ఆదుకోవాలని కోరారు. రెవెన్యూ అధికారులు, తాసీల్దార్ అంజిరెడ్డి మాట్లాడుతూ 518లో ఉన్న భూమి భూదాన్ భూమి అని, అది తమ పరిధిలో లేని అంశం అన్నారు.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు భూ సమస్యను పసరిష్కరించాలన్నారు. ఈ మేరకు తాసీల్దార్ అంజిరెడ్డికి వినతి పత్రం అందజేసి మాట్లాడారు. రెవెన్యూ సదస్సుల్లో వివిధ కారణాలతో దఖాస్తులు చేసుకోలేని రైతులకు మరోమారు అవకాశం కల్పించాలన్నారు. అదే విధంగా ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటూ ఏండ్ల తరబడి జీవనం సాగిస్తున్న వారందరికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరారు.
Bhuvanagiri Collectorate : రాయగిరిలో రసాబాసగా భూ భారతి రెవెన్యూ సదస్సు