ఉదయం తిరుమంజనం.. సాయంత్రం దివ్య ప్రబంధ సేవ
యాదాద్రి, ఫిబ్రవరి 8 : భక్తులకు కల్పతరువుగా నిలుస్తున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అధ్యయనోత్సవాలు మంగళవారం రెండో రోజు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం నిత్యారాధనల అనంతరం తిరుమంజన మహోత్సవం పాంచరాత్రాగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. ప్రబంధ పాశురాలను పఠిస్తూ పురప్పాట్ సేవను వైభవంగా జరిపించారు. స్వామివారి సేవను ఆలయంలో భజంత్రీల నడుమ ఊరేగించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆళ్వారులు కీర్తించిన ప్రబంధాల్లోని పాశురాలను అనుసంధానం చేశారు.
సాయంకాలం పురప్పాట్ సేవ..
సాయంకాలం నిత్యారాధనల అనంతరం పారాయణీకులు దివ్య ప్రబంధాన్ని పఠిస్తూ పురప్పాట్ సేవను వైభవంగా నిర్వహించారు. స్వామివారి సేవను ఆలయంలో ఊరేగించారు. ఈ సందర్భంగా ఆళ్వారులు కీర్తించిన ప్రబంధాల్లో పాశురాలను అనుసంధానం చేశారు. ప్రత్యేక రుత్వికులు, పండితులు సేవల ఎదుట పాశరాలను శాస్ర్తోక్తంగా పఠించారు. వేడుకల్లో ఆలయ ఈఓ గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, పాతగుట్ట ఆలయ ప్రధానార్చకులు మాధవాచార్యులు, ఉప ప్రధానార్చకులు సంపతాచార్యులు, ఏఈఓలు దోర్బాల భాస్కర్శర్మ, శంకర్, జూనియర్ అసిస్టెంట్లు నర్సింహ, కె.సింహాచారి, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
క్షేత్రపాలకుడికి ఆకుపూజ
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బాలాలయంలో నిత్యోత్సవాలు తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకొని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. నిత్యపూజల్లో భాగంగా మొదటగా స్వామివారి బాలాలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, లక్ష్మీనరసింహుల నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఆలయ మహా మండపంలో అష్టోత్తరం జరిపారు. సాయంత్రం అలంకార జోడు సేవోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్వామి సన్నిధిలో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజ పర్వాలు జరిగాయి. కొండపైన విష్ణుపుష్కరిణి చెంత, పాతగుట్ట ఆలయంలో కొలువుదీరిన క్షేత్రపాలకుడిని కొలుస్తూ అర్చకులు పంచసూక్తాలు, మన్యుసూక్త పఠనాలతో అభిషేకించారు. వేదమంత్ర పఠనాలతో ఆంజనేయస్వామిని సింధూరం, పూలతో అలంకరించారు. తమలపాకులతో అర్చించారు. సహస్రనామ పఠనాలతో నాగవల్లి దళార్చనలు చేశారు. లలితా పారాయణము చేసి స్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. శ్రీవారి ఖజానాకు మంగళవారం రూ.12,33,701 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.