భువనగిరి అర్బన్ : రోడ్ల నిర్మాణంలో నాణ్యతాప్రమాణాలు పాటించే లా అధికారులు ప్రత్యేక చొరవ చూపాల ని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని ఓ హోటల్లో పంచాయతీరాజ్శాఖ ఆధ్వర్యంలో 75 ఏండ్ల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంపై సెమినార్ను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి కనెక్టివిటీ రోడ్లు ఏర్పాటు జరుగుతుందన్నారు. పీఎంజీఎస్వై కింద ఏర్పాటు చేసిన రోడ్ల నిర్మాణం నిర్మించిన తేదీ నుంచి ఐదేండ్ల వరకు కాంట్రాక్టర్ బాధ్యత ఉంటుందన్నారు.
ఈ పనులను క్వాలిటీ కంట్రోల్ రాష్ట్ర స్థాయిలో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్థాయిలో ఐదేండ్ల కాలంలో వివిధ దశల్లో పనుల క్వాలిటీ పరిశీలించబడుతుందన్నారు. పీఎంజీఎస్వై పనుల్లో 60శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయగా.. 40శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఈ పథకం కింద ప్రతి ఏడాది 20 కిలోమీటర్ల ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుందన్నారు. రెండు గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణం ఉంటే ముందుగా ప్రణాళిక ప్రకారం ప్రతిపాదనలు చేయాలన్నారు. ఈ ఏడాది హజీపూర్ నుంచి మాచన్పల్లి మధ్యలోని వాగుపై, కందుకూర్ వద్ద గల వాగుపై రెండు బ్రిడ్జిల నిర్మాణానికి నిధులను మంజూరు చేసుకున్నామన్నారు. బీటీ రోడ్ల నిర్మాణంలో ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై పంచాయతీరాజ్శాఖ రిటైర్డ్ ఈఎన్సీ జ్ఞానేశ్వర్ ఆయన అనుభవాలను తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్శాఖ అధికారులు, గ్రామాల సర్పంచ్లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.