యాదగిరిగట్ట, ఫిబ్రవరి 20 : యాదగిరి గుట్టలోని పూర్వగిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. భేరి పూజ, గరుత్మంతుడితో దేవతాహ్వానం తంతును సంప్రదాయబద్ధంగా జరిపారు. బుధవారం నరసింహ స్వామి పెళ్లికొడుకుగా ముస్తాబవనున్నారు. ఈ సందర్భంగా ఎదుర్కోలు ఉత్సవం, వివాహ నిశ్చయ కార్యక్రమం చేపట్టనున్నారు. శ్రీమన్నారాయణుడి వాహనమైన గరుత్మంతుడిని ఆహ్వానించి సకల దేవతలకు యాదగిరీశుడు పెళ్లికొడుకు అవుతున్నారని సబ్బండ బంధుగణంతో తరలిరావాలనే ఆహ్వానాన్ని పంపే తంతును అర్చక బృందం ఆధ్వర్యంలోని వేద పండితులు, అర్చకులు, పారాయణికులు వేదమంత్రాల ఘోషలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లను ఉదయం పంచామృతాలతో ముస్తాబు చేసి పుష్పాలతో అలంకరించారు. స్వామి, అమ్మవార్ల ధ్వజ స్తంభానికి ఎదురుగా ప్రత్యేక పీఠంపై అధిష్టింపజేసి ధ్వజారోహణం తంతు నిర్వహించారు. కుంకుమతో గరుత్మంతుడి చిత్రపటం వేసి, వేద పారాయణాలు, మంగళ వాయిద్యాలతో గరుడ దండకం చదువుతూ ఆలయ ధ్వజస్తంభంపై ఆలంకరించారు. ధ్వజ స్తంభానికి
దర్బలతో తయారు చేసిన తాడుతో గరుత్మంతుడి చిత్రపటానికి వస్ర్తాన్ని కట్టారు. అర్చకుల వేదోక్తమైన పాటలతో గరుత్మంతుడిని ఆహ్వానించారు. సామూహిక దీక్షాపరులైన వేద పారాయణికులచే చతుర్వేద పారాయణం, పురాణ, ఇతిహాస, ప్రబంధ, మూలమంత్ర, మూర్తిమంత్ర జపాలతో ధ్వజారోహణ ఉత్సవాన్ని నిర్వహించారు.
ఆలయంలో హవనం..
బ్రహ్మోత్సాల్లో స్వామి, అమ్మవార్లకు ఎదురుగా అగ్నిప్రతిష్ఠ చేసి, ఆ అగ్నిలో రాగి, మేడి, జువ్వి, మోదుగు, మామిడి చెట్ల కర్రలతో హోమాన్ని వెలిగించారు. అందులో నారాయణ, లక్ష్మి, సుదర్శన, నారసింహ, ఆంజనేయ, గరుడ మొదలైన మూలమంత్రాలతో హవనం చేశారు.
దేవతలకు ఆహ్వానం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిత్యారాధనల అనంతరం వేదపారాయణాలు, మూలమంత్రాలు, అనుష్టానం గావించారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అంశ అయిన లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలకు 33 కోట్ల దేవతలను ఆహ్వానించే ప్రక్రియ దేవతాహ్వానాన్ని సాయంత్రం నిర్వహించారు. అంతకుమందు ఆలయ అర్చకులు భేరిపూజ జరిపారు. సకల దేవతలకు భేరి నినాదాలు, మంగళవాయిద్యాలతో రాగ, తాళయుక్తంగా ఆవాహనం చేసి గర్భాలయంలోని ప్రధాన కలశంలో అధిష్టింపజేశారు. సకల మూలమంత్రాలతో హవనం జరిపారు. ఈ వేడుకల్లో ఆలయ ఆలయ అనువంశికధర్మకర్త బి. నరసింహమూర్తి, ఈఓ రామకృష్ణారావు, డీఈఓ దోర్బల భాస్కర్శర్మ, ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వేంకటాచార్యులు, యాజ్ఞికులు కిరణ్కుమారాచార్యులు, ఉప ప్రధానార్చకులు మాధవాచార్యులు, శ్రీధరాచార్యులు, అధ్యాపకులు నల్లన్థీఘళ్ సీతామనోహరాచార్యులు, పారాయణదారులు నర్సింహాచార్యులు, జగన్మోహనాచార్యులు, వేణగోపాలాచార్యులు, వేద పండితులు పాల్గొన్నారు.
నేడు ఎదుర్కోలు
పాతగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు హవనం, సింహ వాహన సేవ, సాయంత్రం 6 గంటలకు హవనం, రాత్రి 8 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం జరిపించనున్నారు. రాత్రికి శ్రీవారు అశ్వవాహన సేవలో ఊరేగనున్నారు. అనంతరం శ్రీవారి విహహ నిశ్చయ గడియలు ఖరారు చేసే తంతును రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించనున్నారు.