చౌటుప్పల్, జనవరి 24 : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆదర్శ వివాహం చేసుకున్నారు. చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకి చెందిన యువ ఐపీఎస్ అధికారిణి శేషాద్రిని రెడ్డి, కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి ఎలాంటి ఆడంబరం లేకుండా రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. శేషాద్రిని రెడ్డి కుత్బుల్లాపూర్ డీసీపీ గా ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డి ఐఏఎస్ ట్రైనింగ్లో ఉన్నాడు. వీరి వివాహానికి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఉన్నత హోదాల్లో ఉండి కూడా అనవసర ఖర్చులకు తావివ్వకుండా నిరాడంబరంగా వివాహం చేసుకోవడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.