యాదాద్రి, డిసెంబర్ 24 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శనివారం భక్తజన సందడి నెలకొంది. సెలవు దినం కావడంతో ఆలయ మాఢవీధులు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల భక్తులతో సందడి నెలకొంది. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పారు. అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామి వారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు ఉత్సవమూర్తులను ద్యివ మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవ జరిపించారు. కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షించారు. సాయంత్రం వేళలో స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు.
రాత్రివేళలో స్వామికి తిరువారాధన చేపట్టి, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చన చేశారు. పాతగుట్టలో స్వామి వారికి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం ఘనంగా నిర్వహించారు. ధునుర్మాసోత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున అర్చకులు వేదమంత్రాలు పఠిస్తూ అమ్మవార్లకు తిరుప్పావై పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ధనుర్మాస విశిష్టతను భక్తులకు వివరించారు. గోదాదేవి శ్రీరంగనాయకుడిపై రచించిన పాశురాలను పఠిస్తూ అర్చకులు మార్గళి పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 33వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.36,02,552 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
శ్రీవారి సేవలో రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకుడు శ్రీనివాస్రావు
స్వామి వారిని రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకుడు సగడాల శ్రీనివాస్రావు దర్శించుకున్నారు. శనివారం ఉదయం యాదాద్రికి చేరుకున్న ఆయన శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఏఈఓ రాంమోహన్ స్వామివారి ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొవిడ్ ఫోర్త్ వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికే వైద్యాధికారులకు అన్ని రకాల ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఆయన వెంట యాదగిరిగుట్ట పీహెచ్సీ వైద్యాధికారి వంశీకృష్ణ ఉన్నారు.
ఆకట్టుకున్న నృసింహ నర్తనం
తెలంగాణ భాష, సంస్కృతిక శాఖ, స్వర్మహతి కళా పరిషత్ ఆధ్వర్యంలో దేవస్థాన తూర్పు మాఢవీధుల్లో నృసింహ నర్తనం-2022 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
హెలిప్యాడ్ స్థల పరిశీలన
యాదాద్రికి ఈ నెల 30న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రానున్న నేపథ్యంలో ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, పోలీసులు, ఆర్అండ్బీ అధికారులు హెలిప్యాడ్ స్థలాన్ని శనివారం పరిశీలించారు. యాదాద్రి కొండకింద యాగశాలకు కేటాయించిన పార్కింగ్ స్థలంలో మూడు హెలిప్యాడ్లను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రపతి పర్యటనలో భాగంగా ఒకేసారి మూడు హెలికాప్టర్లు రానున్న నేపథ్యంలో వారికి ల్యాడింగ్ కావాల్సి ఉంది. ఈ సందర్భంగా ల్యాడింగ్ కావాల్సిన హెలిప్యాడ్ స్థలాన్ని ఏవియేషన్ ఇంజనీర్, సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. మంగళవారం ఉదయం హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పరిశీలించిన వారిలో యాదిరిగుట్ట ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి, ఆర్అండ్బీ ఈఈ శంకరయ్య, సీఐ సైదయ్య, ఎయిర్ పోర్స్ సిబ్బంది, పైలట్ ఉన్నారు.