యాదగిరిగుట్ట, జూలై 01 : ఈ నెల 5వ తేదీన ఉదయం 10 గంటలకు యాదగిరిగుట్ట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి క్యామ మల్లేశ్, రాష్ట్ర నాయకులు సూదగాని హరిశంకర్ గౌడ్, కల్లూరి రామచంద్రారెడ్డి హాజరు కానున్నట్లు వెల్లడించారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలోని గొంగిడి నిలయంలో మీడియాకు ఆయన వివరాలు వెల్లడించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపునకు చేపట్టాల్సిన వ్యూహాలపై సమావేశంలో వారు పలు సూచనలు చేయనున్నట్లు చెప్పారు. సమావేశానికి ఆలేరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి చెందిన పీఏసీఎస్ చైర్మన్లు, పాల సంఘం చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీలు, రైతు విభాగం కన్వీనర్లు, పార్టీ వివిధ విభాగాల నాయకులు, విద్యార్ధి, యువజన, సోషల్ మీడియా నాయకులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే సామూహిక గిరి ప్రదక్షిణలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పాల్గొననున్నట్లు గొంగిడి మహేందర్రెడ్డి తెలిపారు. తెల్లవారుజామున 6.30 గంటలకు స్వామివారి వైకుంఠ ద్వారం వద్ద స్వామివారి కొండ చుట్టూ పాదయాత్రగా ప్రదక్షిణ చేయనున్నారని, అనంతరం స్వామివారి గర్భాలయంలో నిర్వహించే అష్టోత్తర శతఘటాభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, యువజన విభాగం నియోకవర్గ కన్వీనర్ గడ్డమీది రవీందర్ గౌడ్, జిల్లా నాయకులు మిట్ట వెంకటయ్య, గుండ్లపల్లి వెంకటేశ్ గౌడ్, పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి, మాజీ సర్పంచ్ కసావు శ్రీనివాస్ పాల్గొన్నారు.