భూదాన్ పోచంపల్లి : యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెం గ్రామ శివారులోని పౌల్ట్రీ ఫామ్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో పిట్ట సుదర్శన్ రెడ్డికి చెందిన పౌల్ట్రీ ఫామ్లో ఈ నెల 12న 500 కోళ్లు మృతిచెందాయి. పశు వైద్యాధికారికి సమాచారం ఇవ్వడంతో చనిపోయిన కోళ్ల నమూనాలను సేకరించి వెటర్నరీ బయోలాజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్కు పంపించారు. వాటిని మధ్యప్రదేశ్లోని హై సెక్యూరిటీ పీబీఆర్ ల్యాబ్లో పరీక్షించారు. ఈ పరీక్షల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
దాంతో పశు సంవర్ధక శాఖ వైద్యాధికారి, జిల్లాలోని అధికారులు సిబ్బందితో 32 రాపిడ్ రెస్పాన్స్ టీమ్లుగా ఏర్పడి, పీపీ కిట్లు ధరించి ఫామ్లోని 40 వేల కోళ్లను గుంత తీసి పాతిపెట్టారు. శనివారం పౌల్ట్రీ ఫామ్లో మిగిలిన ఐదువేల కోళ్లను చంపేశారు. ఇప్పటికే 19 వేల గుడ్లను, టన్నుల కొద్ది దానాను దగ్ధం చేశారు. కోళ్లను చంపి గోనే సంచిలో మూట కట్టి గొయ్యి తీసి పూడ్చి పెట్టారు. కోళ్ల ఫామ్ నుంచి ఒక కిలోమీటర్ వరకు పరిసర ప్రాంతాలను రెడ్ జోన్గా ప్రకటించారు. కోళ్ల ఫామ్ను పూర్తిగా శానిటైజ్ చేస్తామని, మూడు నెలల వరకు సీజ్ చేస్తామని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జానయ్య తెలిపారు.
జిల్లా పశు వైద్య అధికారులతోపాటు ప్రాథమిక వైద్యాధికారి, వైద్య సిబ్బంది, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు పౌల్ట్రీ ఫామ్ దగ్గరుండి తగిన చర్యలు తీసుకున్నారు. ధోతిగూడెంలో బర్డ్ ఫ్లూ కేసు నమోదు కావడంతో పరిసర గ్రామాల్లోని పౌల్ట్రీ ఫామ్ యజమానులు, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు చికెన్ షాపులకు గిరాకీ తగ్గింది. అయితే ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని జిల్లా పశు వైద్యాధికారి తెలిపారు.