యాదాద్రి : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బాలాలయంలో నిత్యోత్సవాలు తెల్లవారుజామూన ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. నిత్యపూజల్లో భాగంగా మొదటగా స్వామివారి బాలాలయంలో సుదర్శన నారసింహహోమం, లక్ష్మీనరసింల నిత్య తిరుకల్యాణోత్సవం నిర్వహించారు. ఆలయ మహా మండపంలో అష్టోత్తరం నిర్వహించారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవోత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహించారు. స్వామి సన్నిధిలో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి వారికి ఆకుపూజ పర్వాలు చేపట్టారు.
వేదమంత్ర పఠనాలతో ఆంజనేయస్వామికి సింధూరం, వివిధ రకాల పూలతో అలంకరణ చేపట్టారు. తమలపాకులతో అర్చించి, వివిధ రకాల పూలమాలలతో అలంకరించి ఆంజనేయుడి సహస్రనామ పఠనాలతో నాగవల్లి దళార్చనలు నిర్వహించారు. లలితా పారాయణము చేసి, ఆంజనేయస్వామివారికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. శ్రీవారి ఖజానాకు మంగళవారం రూ. 12,33,701 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో ఎన్.గీత తెలిపారు.