యాదాద్రిలో ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రిలో వీవీఐపీల ఆతిథ్యం కోసం నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం అట్టహాసంగా ప్రారంభించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేయగా 14 విల్లాలకు సంబంధించిన శిలాఫలకాలను సీఎం ఆవిష్కరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రెసిడెన్షియల్ సూట్కు చేరుకున్నారు. 1.17 గంటలకు రెండు శిలాఫలకాలను ప్రారంభించారు. ప్రధాన ద్వారం వద్ద గులాబీ రిబ్బన్ను కట్ చేసి లోపలికి అడుగుపెట్టారు. 1.20 గంటలకు ఆలయ అర్చకులు చేపట్టిన వాస్తు, నవగ్రహ, నారసింహస్వామి పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్లో అరగంట పాటు కలియదిరిగారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్యయాదవ్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అరగంట అనంతరం 1.47 గంటలకు సీఎం కేసీఆర్ ప్రగతిరథంలో భువనగిరికి బయల్దేరారు.
విశేషాల సమాహారం..
ప్రెసిడెన్షియల్ సూట్ను రాష్ట్రపతి, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్ల విడిదికి మాత్రమే వినియోగించనున్నారు.
వీవీఐపీల విడిది కోసం కొండ దిగువన ఉత్తరాన 13.26 ఎకరాల చిన్న కొండపై ప్రెసిడెన్షియల్ సూట్, 14 విల్లాల నిర్మాణం దాతల ఆర్థిక సహకారం రూ.143.80 కోట్లతో పూర్తి చేశారు.
రూ.17 కోట్ల వ్యయంతో 15,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రెసిడెన్షియల్ సూట్, రూ.5కోట్లతో 7,500 చదరపు అడుగుల స్థలంలో ఒక్కో విల్లాను రెండంతస్తులుగా నిర్మించారు.
ప్రెసిడెన్షియల్ సూట్లో 6 బెడ్రూమ్లు, వెయింటింగ్ హాల్, డైనింగ్ హాల్, కిచెన్తోపాటు సేద తీరేందుకు సిట్ ఔట్ రూమ్లను సైతం ఏర్పాటు చేశారు. ఏకకాలంలో 6 కుటుంబాలు విడిది చేసేలా తీర్చిదిద్దారు.
ఉడెన్ ప్లాస్టిక్తో కిటికీలు, టేకుతో తయారు చేసిన ద్వారాలను బిగించారు.
ఒక్కో విల్లాలో 5 బెడ్రూమ్లు ఉన్నాయి. వీటిని దాతలు, మంత్రులు, ఆ స్థాయి ముఖ్యులకు మాత్రమే కేటాయించనున్నారు.
యాదాద్రీశుడిని దర్శించుకుని తిరిగి ప్రెసిడెన్షియల్ సూట్కు వచ్చేందుకు ప్రత్యేకమైన రోడ్లను నిర్మించారు.
25మంది కూర్చొనేలా ప్రత్యేకమైన వెయిటింగ్ లాంజ్లు, 50 మందితో సమావేశమయ్యేలా విశాలమైన కాన్ఫరెన్స్ హాల్ నిర్మించారు.