వారి ఖజానాకు రూ.10,79,317
యాదాద్రి, ఫిబ్రవరి 11 : యాదాద్రి లక్ష్మీనారసింహుడి బాలాలయంలో ఊంజల్ సేవోత్సవం శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా భావించే ఊంజల్ సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష్మీ అమ్మవారిని విశేష పుష్పాలతో అలంకరించారు. ముత్తయిదువులు మంగళ హారతులతో అమ్మ వారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖ మండపంలోని ఊయలలో శయనింపు చేశారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటల కోలాహలం కొనసాగింది. స్వామి ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజామున 3గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం 4గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేయడంతో పాటు, హారతి నివేదనలు చేశారు. ఉదయం 8గంటలకు నిర్వహించిన సుదర్శన హోమంతో శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం చేశా రు. బాలాలయ ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా రూ.600 టిక్కెట్ తీసుకున్న భక్తులకు సువర్ణ పుష్పార్చన పూజలు జరిపించారు.
బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చించారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని విభాగాల నుంచి రూ.10,79,317 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
జీయర్ స్వాముల సందర్శన
యాదాద్రి నారసింహుడిని శ్రీవిల్లిపుత్తూరు జీయర్ స్వామిజీ, తిరునగరి జీయర్ స్వామిజీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు వారికి ఆలయ సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. స్వామిజీలు బాలాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం బాలాలయ ముఖమండపంలో అధికారులు వారికి స్వామివారి ప్రసాదాన్ని అందించారు.
ఎమ్మెల్యేల పూజలు
శ్రీవారిని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి స్వామివారి వేదాశీర్వచనం అందించగా, ఆలయ ఏఈఓ గట్టు శ్రవణ్కుమార్ వారికి స్వామివారి ప్రసాదం అందించారు.