ఉద్యమకాలం నుంచి సాన్నిహిత్యం
ముషంపల్లికు చెందిన రైతు బోర్ల రాంరెడ్డి
నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 16 : నల్లగొండ మండలం ముశంపల్లి గ్రామానికి చెందిన బైరెడ్డి రాంరెడ్డి (బోర్ల రాంరెడ్డి) వ్యవసాయ భూమిలో 2002-05 మధ్యకాలంలో 100కు పైగా బోర్లు వేసినా చుక్క నీరు పడలే.. అప్పట్లో ది ఇంగ్లిష్ పత్రికలో ఆ విషయం ప్రచురితమైంది. ఇదే సమయంలో కరువు పరిస్థితులపై అప్పట్లో మీడియా వరుస కథనాలు ప్రచురించింది. ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ఉన్న కేసీఆర్ రాంరెడ్డి గురించి తెలుసుకుని ఆయన్ను అక్కడికి పిలిపించుకొని వివరాలు తెలుసుకున్నారు. అప్పటినుంచి ఉద్యమ సమయంలో ఏ సభలో కేసీఆర్ మాట్లాడినా తెలంగాణ నీటి వాటాలో అన్యాయం గురించి చెప్పాల్సి వచ్చినా… కరువు పరిస్థితులకు కారణాలు వివరించాల్సి వచ్చినా బైరెడ్డి రాంరెడ్డిని బోర్ల రాంరెడ్డిగా సంబోధిస్తూ కేసీఆర్ ఉదహరించేవారు. ఆ తర్వాత కేసీఆర్ చేపట్టిన పాదయాత్రలో రాంరెడ్డి పాల్గొనేవాడు. బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాంరెడ్డిని కదిలిస్తే వారి అనుబంధానికి సంబంధించిన విషయాలను వివరించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో కలుస్తానికి వెళ్లిన. మా ఊరు చెరువుకు లిఫ్ట్ ఏర్పాటు చేయించుకోవాలనేది నా కోరిక. ఇదే విషయాన్ని చెప్పిన. అప్పుడు కేసీఆర్ నన్ను వాళ్ల ఇంటికి తీసుకెళ్లి తనతోపాటు కూర్చోబెట్టుకుని భోజనం చేసిన గొప్ప విషయం నా జీవితంలో మర్చిపోలేనిది. తర్వాత మా ఊరు చెరువును రెండు కోట్లతో మిషన్ కాకతీయలో పూడికతీసి, ఎస్ఎల్బీసీ నీళ్లతో నింపారు. అప్పటి నుంచి దాదాపు కరువు అంటూ కానరాలేదు. తర్వాత ఓ సారి నా కొడుకు కృష్ణారెడ్డి, సాహితీల పెళ్లికి రమ్మని పిలుస్తానికి కేసీఆర్ వద్దకు వెళ్లిన. నా పిలుపుకు మన్నించి నల్లగొండకు వచ్చి నా కొడుకు,కోడలును ఆశీర్వదించారు. రాష్ర్టాన్ని సాధించుకువచ్చిన కేసీఆరే ముఖ్యమంత్రి కావడం ప్రజల అదృష్టమే. రైతులకు కావాల్సిన నీళ్లు, కరంట్ కేసీఆర్ ఇస్తున్నారు. ఆయన జన్మదినం రైతులకు ఒక వేడుకనే.. ఆయన ఆయురారోగ్యాలతో ఉండి రాష్ట్రంతో పాటు భవిష్యత్లో దేశాన్ని సుభిక్షంగా చూడాలని మా ఆకాంక్ష.. అని చెప్పుకొచ్చారు.