అందరిదీ పేద గిరిజన గిరిజన బిడ్డలే..
ఆత్మకూర్.ఎస్ మండలం నశింపేట వద్ద ప్రమాదం
ఆత్మకూర్.ఎస్, ఫిబ్రవరి 11 : అతివేగం నలుగురి ప్రాణాలు తీసింది. బైకులు ఢీకొని నలుగురు యువకులు మృతి చెందారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలం నశింపేట గ్రామ శివారులో గురువారం అర్ధ్దరాత్రి ఈ ఘటన జరిగింది. మృతులంతా 20 ఏండ్లలోపు గిరిజన కూలీల కుటుంబాలకు చెందిన వారే. మృతుల్లో ఇద్దరు పదో తరగతి, మరో ఇద్దరు డిగ్రీ చదువుతున్నారు. మండలంలోని తెట్టేకుంటకు చెందిన బానోతు అరవింద్(17), ఏపూరు తండాకు చెందిన వాంకుడోతు వినేశ్(18) ఆత్మకూర్.ఎస్ మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతూ స్థానిక ఎస్సీ హాస్టల్లో ఉంటున్నారు. గురువారం పాఠశాలకు వెళ్లకుండా నూతనకల్ మండలం దిర్శనపల్లిలో జరిగిన ఓ వేడుకలో క్యాటరింగ్కు వెళ్లారు. వేడుక ముగిశాక చివ్వెంల మండలం లక్ష్మీనాయక్తండాకు వెళ్లి బెల్ట్ షాపులో మద్యం తాగారు. అర్ధ్దరాత్రి బైక్పై తండాకు బయల్దేరారు. చివ్వెంల మండలం లక్ష్మీనాయక్తండాకు చెందిన ధరావత్ ఆనంద్(22) అతడి స్నేహితుడు భూక్యా నవీన్(21)తో కలిసి ఆత్మకూర్.ఎస్ మండలం రామోజీతండాకు వెళ్తుండగా నశింపేట వద్దకు రాగానే రెండు బైకులు ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. ప్రమాదంలో అరవింద్, ఆనంద్, భూక్యా నవీన్ ఘటనాస్థలంలోనే మృతి చెందారు. వాంకుడోతు వినేశ్కు తీవ్ర గాయాలు కావడంతో దవాఖానకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను సూర్యాపేట జనరల్ దవాఖానకు తరలించినట్లు ఎస్ఐ యాదవేందర్రెడ్డి తెలిపారు.
ఏపూరుతండాలో విషాద ఛాయలు
ఆ ఇంటికి పెద్దకొడుకు ఇక లేడని.. చదువుతూ పనిచేస్తూ తన తమ్ముడిని తానే చదివిస్తానమ్మా అని వినేశ్ మాటలు తమ కష్టాన్నంత మరిపించేయమ్మా.. అప్పుడప్పుడు దొరికిన పని చేసి వచ్చిన డబ్బులు తమకే ఇచ్చే వాడంటూ అతని జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ తల్లిదండ్రులు బోరున విలపించారు. ఏపూరు తండాకు చెందిన వాంకుడోతు బాసు, పార్వతి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడైన వినేశ్ ఆత్మకూర్(ఎస్) ఆదర్శ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. వినేశ్ మృతితో ఏపూరుతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి
మంత్రి జగదీశ్రెడ్డి ఓదార్పు
రోడ్డు ప్రమాదంలో యువకులు మృతి చెందిన విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి చలించిపోయారు. వెంటనే హైదరాబాద్ నుంచి సూర్యాపేట ప్రభుత్వ జనరల్ దవాఖానకు చేరుకుని యువకుల మృతదేహాల వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంబంధిత వివరాలను తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు.