యాదాద్రి, సెప్టెంబర్ 9 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రంలోని అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా నిర్వహించే సేవలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. ప్రధానార్చకుడు ఆధ్వర్యంలోని అర్చక బృందం వైభవంగా పూజలు నిర్వహించింది. ముత్తయిదువులు మంగళహారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధిసేవ అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలోని ఊయలలో శయనింపు చేశారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటల కార్యక్రమం కోలాహలంగా సాగింది. స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు వైభవంగా నిర్వహించారు. సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన, నిజాషేకాలతో స్వామివారి నిత్యారాధనలు ప్రారంభించారు.
స్వామివారికి సహస్రనామార్చన, లక్ష్మీఅమ్మవారికి కుంకుమార్చనలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. నారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేసి, హారతి నివేదనలు అర్పించారు. ఉదయం సుమారు గంటన్నర పాటు సుదర్శన హోమంతో శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం చేశారు. అనంతరం దేవేరులను ముస్తాబు చేసి గజవాహన సేవ చేశారు. ప్రతిరోజూ నిర్వహించే తిరు కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపించారు. అనంతరం నిర్వహించిన మొక్కు బ్రహ్మోత్సవ వేడుకల్లో భక్తులు పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రంవేళ ఉభయ జోడు సేవలు, దర్బార్ సేవ నిర్వహించారు. రాత్రి నివేదన, శయనోత్సవ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. దీక్షాపరుల మండపంలో నిర్వహిస్తున్న సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్రతమాచరించారు. మధ్యాహ్నం 12నుంచి సాయంత్రం 6గంటల వరకు 11,169మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. వివిధ విభాగాలు కలుపుకొని శ్రీవారి ఖజానాకు రూ.13,72,710 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామివారి సేవలో ప్రముఖులు
యాదాద్రీశుడిని హైకోర్టు న్యాయమూర్తులు శ్రీనివాస్రావు, సీవీ.భాస్కర్రెడ్డి, ఎన్ఐఏ డీఐజీ వందన, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు వేర్వేరుగా కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి ఆలయ సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. దర్శన అంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం అందించారు.