శ్రీవారి ఖజానాకు రూ.14,53,119 ఆదాయం
యాదాద్రి, మే 18 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో బుధవారం నిత్య కల్యాణోత్సవాన్ని వైభవంగా జరిపించారు. ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణం చేపట్టారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనాన్ని పురవీధుల్లో ఊరేగించారు.
శ్రీలక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు జరిపారు. తొలుత స్వామికి సుదర్శన నారసింహ హోమం చేశారు. స్వామి వారి నిత్యపూజలు వేకువజామున 3.30గంటలకు ప్రారంభమయ్యాయి. స్వయంభువులను ఆరాధించి పంచామృతాలతో అభిషేకించి, తులసీ అర్చనలు చేశారు. అనంతరం లక్ష్మీనర్సింహులను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం అలంకార జోడు సేవలు నిర్వహించారు.
భక్తులతో నిర్వహించే సువర్ణ పుష్పార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి సహస్రనామార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామికి సహస్రనామార్చనలు చేశారు. శ్రీ పర్వతవర్ధిణీ సమేత రామలింగేశ్వర ఆలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యారాధనలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీవారి ఖజానాకు రూ.14,53,119 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.