సూర్యాపేట టౌన్, నవంబర్ 6 : మునుగోడు విజయంతో దేశంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) జైత్రయాత్ర మొదలైందని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విజయంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీ రామరక్ష అని, ప్రజలంతా నమ్మి ఆయనకు అన్ని విధాలుగా వెన్నంటి ఉంటున్నారని.. ఇదే మంత్రాన్ని మునుగోడు ప్రజలు సైతం నమ్మి తీర్పు ఇచ్చారని వివరించారు. టీఆర్ఎస్ విజయంలో కీలక పాత్ర వహించిన మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు, వామపక్షాలు, పార్టీ ముఖ్య నాయకులకు, కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. తమ విచక్షణతో తెలివైన నిర్ణయం తీసుకున్న మునుగోడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది బీజేపీ పై బీఆర్ఎస్ సాధించిన తొలివిజయంగా పరిగణించాలని పేర్కొన్నారు. తెలంగాణలో కుట్రలు చెల్లవని ప్రజలు బీజేపీకి చెంపచెల్లుమనిపించారని తెలిపారు. ఈ విజయం తెలంగాణ ఆత్మ గౌరవ విజయమని ఇది పూర్తిగా సీఎం కేసీఆర్ విజయం అని తెలిపారు.