మునుగోడు రూరల్, నవంబర్ 6 : మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓటర్లను తనవైపు తిప్పుకొనేందుకు అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసింది. అయినా మునుగోడు మండల ప్రజలు వారికి లొంగకుండా అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉన్న టీఆర్ఎస్కు అండగా నిలిచి ఆధిక్యతను అందించారు. మండలంలో మొత్తం 27 గ్రామ పంచాయతీలకు గాను 22 గ్రామ పంచాయతీల్లో టీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం లభించింది. ఐదు గ్రామాల్లో స్వల్ప ఆధిక్యత వచ్చింది. మండలంలో కాంగ్రెస్ ప్రభావం అంతగా కనిపించలేదు. ఏఒక్క గ్రామంలోనూ ఆ పార్టీకి ఆధిక్యం రాలేదు. ఇటీవల జరిగిన చండూరు సభలో మునుగోడు విజయంతోనే బీఆర్ఎస్కు పునాది పడాలంటూ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో మండల ప్రజలు ఆయనకు వెన్నంటి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం సాధించడం, అందులో మునుగోడు నుంచి మంచి ఆధిక్యం లభించడంతో ప్రజలు సంబురాల్లో మునిగి పోయారు. మునుగోడును వీర మునుగోడుగా సంబోధించుకుంటున్నారు. అదే ఉత్సాహంతో నల్లగొండ నుంచి మునుగోడుకు వెళ్లే రోడ్డుపై ఉన్న బోర్డును వీర మునుగోడుగా మార్చి సంబుర పడ్డారు.