సంస్థాన్నారాయణపురం. నవంబర్ 6 : మునుగోడు ఉపఎన్నికల ఫలితాల్లో మండల ప్రజలు టీఆర్ఎస్ వెంట నడిచారు. ముఖ్యంగా గిరిజనులు టీఆర్ఎస్కు భారీ మెజార్టీ అందించారు. మండలంలో 36430 మంది ఓటర్లు ఉండగా 54 పోలింగ్ బూత్లలో 34155 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇందులో టీఆర్ఎస్కు 13,533 ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలువగా బీజేపీ 11,695 ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీకి కేవలం 5,679 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం మీద టీఆర్ఎస్కు 1832 ఓట్ల ఆధిక్యం లభించింది. చిట్టన్నబావి, మల్లారెడ్డిగూడెం గ్రామాల్లో టీఆర్ఎస్కు అత్యధిక ఓట్లు పోలయ్యాయి. దాంతో పాటు గిరిజన తాండాలైన వెంకం బావితండా, తుంబావితండా, రాచకొండ, పొర్లగడ్డ తండా, గుడిమల్కాపురం, కొత్తలాపురం, చిమిర్యాల, సర్వేలు, లింగంవారిగూడెం, గుజ్జ, శేరిగూడెం, మహ్మదాబాద్, నారాయణపురం, గాంధీనగర్ తండా, కొత్తగూడెం, వాచ్య తండా, గంగ మూల తండా, పుట్టపాక, వాయిలపల్లి, రాచకొండ, మర్రిబాయితండాలో టీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యత లభించింది.
గిరిజన ఓటర్లంతా కారుకే
మండలంలో 6,354 మంది గిరిజన ఓటర్లు ఉన్నారు. ఇందులో 6011 మంది ఒటు హక్కును వినియోగించుకోగా టీఆర్ఎస్ 2,494, బీజేపీకి 1,975, కాంగ్రెస్కు 8,96, ఇతరులకు 646 ఓట్లు పోలయ్యాయి. గిరిజనులు గతంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ అందించారు. కానీ సీఎం కేఈఆర్ గిరిజనుల అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తుండడంతో వారంతా టీఆర్ఎస్కే జైకొట్టారు. గిరిజనులను తన వైపునకు ఆకట్టుకునేందుకు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేశారు. కొందరు గిరిజన నాయకులను డబ్బులతో కొనుగోలు చేసి తమ పార్టీలో చేర్చుకున్నాడు. నాయకులు పార్టీలు మారినా గిరిజనులు మాత్రం టీఆర్ఎస్కు ఓటేసి తమ జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ వెంటే ఉన్నామని నిరూపించారు.
కూసుకుంట్ల వెంటే సొంతూరు ప్రజలు
సంస్థాన్ నారాయణపురం : టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సొంతూరైన సంస్థాన్నారాయణపురం మండలం లింగవారిగూడెం ప్రజలు మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ వెంటే నడిచారు. ఈ గ్రామంలో మొత్తం 546 ఓట్లు ఉండగా, 533 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్ఎస్ 401, బీజేపీకి 62, కాంగ్రెస్కు 27, బీఎస్పీ 27, ఇతరులకు16 ఓట్లు పడ్డాయి. దాంతో కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సొంతూరులో 339 ఓట్ల ఆధిక్యం లభించింది.