యాదాద్రి భువనగిరి, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికను ఎన్నికల అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. ఉపఎన్నికలో 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 298 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 1,192 ఈవీఎంలు, 596 వీవీ ప్యాట్లు, 596 కంట్రోల్ యూనిట్లను ఉపయోగించారు. ఒక్కో కేంద్రంలో మూడు ఈవీఎంలు, ఒక వీవీ ప్యాట్ను వినియోగించారు. బుధవారం సాయంత్రమే ఎన్నికల సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలను చేరుకున్నారు. అక్కడే ఏర్పాట్లన్నీ చూసుకుని రాత్రి బస చేశారు. ఉదయం 5.30 గంటలకే ఈవీఎంలు తెరిచి ఆయా పార్టీల ఏజెంట్ల ముందు మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ షురూ అయ్యింది. గుర్తింపు కార్డు, ఓటరు స్లిప్ను క్షుణ్ణంగా పరిశీలించాకే సీరా గుర్తు వేసి.. ఓటుకు అనుమతించారు. పోలింగ్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 అమలు చేశారు.
స్వచ్ఛందంగా తరలివచ్చిన ఓటర్లు
దేశ వ్యాప్తంగా హాట్ టాఫిక్గా మారిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ఓటర్లు స్వచ్ఛందంగా తరలివచ్చారు. పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొని ఓటేశారు. స్థానికంగా ఉన్న ఓటర్లే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు సైతం భారీ సంఖ్యలో క్యూకట్టారు. కుటుంబ సమేతంగా సొంత వాహనాలు, బస్సుల్లో సొంతూర్లలో వచ్చారు. హైదరాబాద్ నుంచి ఓటర్లతో చౌటుప్పల్, నారాయణపురం, మునుగోడు రహదారులు నిండిపోయాయి. టీఆర్ఎస్ను గెలిపించాలనే కసితో ఓట్లు వేశారు.
పోలింగ్ తీరు ఇలా..
ఉప ఎన్నిక పోలింగ్ సరళిగా విభిన్నంగా కొనసాగింది. ఉదయం ఒక తీరుగా..మధ్యాహ్నం మరో విధంగా పోలింగ్ ప్రక్రియ నడిచింది. ఉదయం పోలింగ్ మందకొడిగా నడిచింది. అనేక చోట్ల సాయంత్రం తర్వాత ఓటర్లు తండోపతండాలుగా తరలివచ్చారు. మొత్తం మునుగోడు నియోజకవర్గంలో 2,41,805మంది ఓటర్లు ఉండగా.. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 11.6 శాతం వరకు ఓట్లు పోలయ్యాయి. 9 నుంచి 11గంటల వరకు 25.8శాతం, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41.3 శాతం, మూడు గంటల వరకు 59.92 శాతం, సాయంత్రం ఐదు గంటల వరకు 77.55 శాతం పోలింగ్ శాతం నమోదైంది. ఇక మునుగోడులో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఏకంగా రికకార్డు స్థాయిలో 92 శాతం పోలింగ్ నమోదైంది. ద2018 సాధారణ ఎన్నికల్లో 92 శాతం ఓట్లు పోలయ్యాయి. 2014 ఎన్నికల్లో మాత్రం 82 శాతం ఓట్లు పోలైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
సాయంత్రం తర్వాత పోలింగ్ కేంద్రాల్లో క్యూ..
సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు భారీగా పోలింగ్ బూత్లకు చేరుకున్నారు. ఓటర్లు ఉద్దేశపూర్వకంగానే సాయంత్రం వరకు ఓట్లు వేయలేదనే ప్రచారం జరుగుతున్నది. డబ్బులు పంపిణీ చేస్తారేమో అనే ఆశతో సాయంత్రం వరకు పోలింగ్ బూత్లకు వెళ్లలేదు. ఒక్కసారిగా అంతా 5 నుంచి 6 గంటల మధ్య పోలింగ్ కేంద్రాలకు బారులు దీరారు. ఆరు గంటల వరకు కేంద్రాలకు చేరుకుని క్యూలో నిల్చోన్న వారికి ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. అనేక చోట్ల రాత్రి ఎనిమిది గంటల వరకు ఓటు వేశారు. పోలింగ్ ప్రక్రియ అనంతరం అధికారులు ఈవీఎంలకు సీల్ చేశారు. పోలీసు బందోబస్తు మధ్య నల్లగొండకు తరలించారు. ఆర్జాలబావిలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమల్లో భద్రపరించారు. ఈ నెల 6న నల్లగొండలో ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజు ఉప ఎన్నిక విజేత ఎవరో తేలనుంది.
బీజేపీ తీరుతో చెదురుముదురు ఘటనలు..
ఉప ఎన్నిక పోరులో చెదురుముదురు ఘటనలు మినహా భారీ ఘటనలు చోటుచేసుకోలేదు. కొన్ని చోట్ల బీజేపీ శ్రేణులు కవ్వింపులు దిగే ప్రయత్నం చేశాయి. అయినప్పటికీ టీఆర్ఎస్ మౌనంగా ముందుకెళ్లింది. మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. మర్రిగూడ మండలంలోని శివన్నగూడెంలో రాజగోపాల్రెడ్డిపై తిరగబడ్డారు. చండూరులో రాజగోపాల్రెడ్డి పీఏ డబ్బులు పంచుతుండగా, టీఆర్ఎస్ శ్రేణులు పోలీసులకు పట్టించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు లాఠీలకు పని చెప్పారు. గంట పాటు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అవాంఛనీయ ఘనటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పటిష్ట బందోబస్తు..
పోలింగ్ కోసం నియోజకవర్గ వ్యాప్తంగా 3,365 పోలీస్ సిబ్బందితోపాటు 15 కంపెనీల కేంద్ర బలగాలు విధులు నిర్వహించాయి. బుధవారం రాత్రే పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. పోలింగ్ సమయంలో బయటి వ్యక్తులు రాకుండా చర్యలు తీసుకున్నారు. బీజేపీ శ్రేణులు కవ్వించినా సమర్థంగా విధులు నిర్వర్తించారు. ఎస్పీ రెమారాజేశ్వరి, డీఎస్పీ వెంకటేశ్వరెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎలాంటి సంఘటనలు జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.