యాదాద్రి, ఆగస్టు 9 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం మహాపూర్ణాహుతి, పవిత్రమాలధారణలతో పవిత్రోత్సవాలు పరిపూర్ణమయ్యాయి. ప్రధానాలయంలో ఉత్సవమూర్తులకు నవ కలశాలతో స్వప్నతిరుమంజనం జరిపి దివ్య మనోహరంగా అలంకరించారు. వెలుపలి ప్రాకార మండపం యాగశాలలో స్వామి, అమ్మవార్లను అధిష్ఠింపజేసి పంచసూక్త, మూలమంత్ర హోమ పూజలు, మహాపూర్ణాహుతి నిర్వహించారు. 108 నూలు పోగులతో తయారు చేసిన మాలలను ఊరేగింపు నిర్వహించారు. ప్రధానాలయంలో స్వయంభూ, అలంకారమూర్తుల వద్ద పూజలు చేసి, స్వామి, అమ్మవార్లతోపాటు విమానగోపురంపైన గల మహాసుదర్శన చక్రానికి పవిత్రమాలలను అలంకరించారు. ఈ పర్వాలను దేవస్థాన ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మరింగంటి మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకుడు కాండూరి వెంకటాచార్యులు, అర్చకులు కిరణ్కుమారాచార్యులు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఆలయ అధికారులు దోర్బల భాస్కర్ శర్మ, సురేందర్రెడ్డి, గజవెల్లి రమేశ్బాబు పాల్గొన్నారు.
పాతగుట్టలో..
పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వయంభువులకు పవిత్ర మాలధారణతో ఉత్సవాలకు ముగింపు పలికారు. యాగశాలలో మూలమంత్ర హవనం జరిపి మహాపూర్ణాహుతి నిర్వహించారు.
భక్తుల సందడి..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొన్నది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో క్యూలైన్లు, మాఢవీధుల్లో రద్దీ కనిపించింది. స్వామివారి దర్శనానంతరం మాఢవీధుల్లో సేదతీరుతూ, సెల్ఫోన్లతో ఫొటోలు దిగుతూ సందడి చేశారు.
నిత్య పూజలు
వేకువజామున సుప్రభాతంతో ప్రధానాలయంలోని లక్ష్మీనరసింహస్వామిని మేల్కొలిపిన అర్చకులు స్వయంభూ, కవచమూర్తులను హారతితో కొలిచారు. ఉత్సవమూర్తులకు అభిషేకం, అర్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి వెండిజోడు సేవ నిర్వహించారు. స్వామివారికి నిత్యారాధణ, సహస్ర నామార్చనలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి అర్చకులు ఆకుపూజ జరిపారు. ఉదయం స్వామి, అమ్మవార్లకు తిరువారాధన, నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. సత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. శ్రీవారి ఖజానాకు రూ.20,43,083 సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.
నేటి నుంచి స్వామివారి నిత్యకల్యాణం
పవిత్రోత్సవాల్లో భాగంగా రెండురోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసిన స్వామివారి సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఉత్సవాల్లో పలువురు
యాదాద్రి ఆలయంలో జరిగిన పవిత్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం పూ ర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్, చలన చిత్ర నిర్మాణ సంస్థ వారాహి అధినేత సాయి కొర్రపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహా పవిత్రక్రతువులో పాల్గొనడం తమ అదృష్టమన్నారు. శ్రావణ సౌభాగ్యవేళ యాదాద్రి ఆలయ దర్శనం చేసుకోవడం, తమకు అనిర్వచనీయ అనుభూతిని మిగిల్చిందన్నారు.
పవిత్రోత్సవాలతో ఆలయ,ప్రాకృతిక దోషాలు దూరం
మంత్రవిద్యల హోమం క్రతువుల మధ్య అత్యద్భుతంగా సాగే పవిత్రోత్సవాల వల్ల ఆలయాల్లో జరిగే దోషాలు తొలగడమే కాకుండా అవి మరింత పవిత్రతను సంతరించుకుంటాయని శాస్ర్తాలు పేర్కొంటున్నాయని ఆలయ ఈఓ ఎన్. గీత, ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు అన్నారు. ఆలయాల మహావైభవం కోసం జరిగే పవిత్రోత్సవాలు వేదాల బలం వల్లనే నిర్విఘ్నంగా సాగుతున్నాయని చెప్పారు.
ఘనంగా శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో శ్రావణమాసం సందర్భంగా ప్రధానాలయ ఈశాన్య ప్రాకార మండపంలో శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన అత్యంత వైభవంగా కొనసాగుతున్నది. 12వ రోజు లక్ష్మి అమ్మవారికి అర్చన చేపట్టారు. 30 మంది రుత్వికులతో చేపట్టిన లక్ష్మీసహస్రనామ పఠనం కొనసాగుతున్నది. రూ.2 వేల టికెట్తో కుంకుమార్చనలో పాల్గొనే భక్తుల పేరిట అర్చకులు సంకల్పం చేపట్టారు.