యాదాద్రి, మే 30 : యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్దినీ సమేత రామలింగేశ్వరస్వామి ప్రధానాలయ ముఖ మండపంలోని స్ఫటిక లింగానికి అర్చనలు చేశారు. సోమవారం కావడంతో గర్భాలయంలోని లింగేశ్వర కుటుంబంతో పాటు ఆలయంలో నూతనంగా ప్రతిష్ఠించిన స్పటిక లింగేశ్వరుడికి అర్చకులు, పురోహితులు ప్రభాతవేళ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని సుమారు గంటన్నర పాటు నిర్వహించారు. రామలింగేశ్వరుడిని ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకించారు. అభిషేక ప్రియుడైన పరమశివుడిని విభూతితో అలంకరించారు.
ఉపాలయాల్లో వెలిసిన సుబ్రమణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు అభిషేకం చేసి అర్చించారు. శివాలయం ప్రధాన పురోహితుల ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ చేశారు. లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామికి సుప్రభాత సేవ, తిరువారాధన చేపట్టి ఆరగింపు చేపట్టారు. అనంతరం భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. స్వామికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు.
స్వామివారి సువర్ణ పుష్పార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ఉదయం సుదర్శన నారసింహ హోమం, ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. అనంతరం ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్భార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు.
పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. యాదాద్రి కొండకింద పాతగోశాల వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.25,25,411 ఆదాయం సమకూరిందని ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు తెలిపారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 1,87,800
వీఐపీ దర్శనాలు 3,15,000
వేద ఆశీర్వచనం 6,600
నిత్య కైంకర్యాలు 2,801
సుప్రభాతం 5,900
క్యారీబ్యాగుల విక్రయం 5,000
వ్రత పూజలు 67,200
కళ్యాణకట్ట టిక్కెట్లు 24,000
ప్రసాద విక్రయం 13,76,230
వాహనపూజలు 15,000
అన్నదాన విరాళం 12,110
సువర్ణ పుష్పార్చన 1,44,400
యాదరుషి నిలయం 72,260
పాతగుట్ట నుంచి 40,210
కొండపైకి వాహన ప్రవేశం 2,50,000
లక్ష్మీ పుష్కరిణి 800
గోపూజ 100