యాదాద్రి, మే 28 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రం శనివారం భక్తులతో సందడిగా మారింది. స్వయంభూ నారసింహుడి దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్లు, మాఢవీధులు, ప్రసాద విక్రయశాలతో పాటు ప్రధానాలయం భక్తులతో నిండిపోయింది. స్వయంభువులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం మూడున్నర గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. తిరువారాధన, బాలబోగం, స్వామికి నిజాభిషేకం నిర్వహించారు.
స్వామి, అమ్మవార్లకు తులసీ సహస్రనామార్చనలు, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చనలు చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, స్వామి, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన, వెండి మొక్కు జోడు సేవలను అర్చకులు ఘనంగా నిర్వహించారు. క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి నిర్వహించిన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కొండకింద పాతగోశాల వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. పాతగుట్టలో స్వామి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటకంగా కొనసాగాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వయంభువులను దర్శించుకున్నారు. శ్రీవారి ఖజానాకు రూ. 28,54,696 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉదయ్ ఉమేశ్ లలిత్ సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చక బృందం వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వయంభూ దర్శనం అనంతరం గర్భాలయ ముఖ మండపంలో ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనర్సింహాచార్యులు వేదాశీర్వచనం అందించారు.
ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు స్వామి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ యాద్రాది ఆలయ పునర్నిర్మాణాలను పరిశీలించారు. గర్భాలయం, మాఢవీధులు, పంచతల రాజగోపురాలు, అష్టభుజి మండపాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన వెంట హైకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భూయన్, నాల్స సభ్యుడు అశోక్కుమార్ జైన్, న్యాయమూర్తులు ఉన్నారు. అంతకుముందు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కలెక్టర్ పమేలా సత్పతి, డీసీపీ నారాయణరెడ్డి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 3,43,550
వీఐపీ దర్శనం 3,45,000
వేద ఆశీర్వచనం 6,000
నిత్యకైంకర్యాలు 300
సుప్రభాతం 5,100
క్యారీబ్యాగుల విక్రయం 13,750
వ్రత పూజలు 2,38,400
కళ్యాణకట్ట టిక్కెట్లు 42,000
ప్రసాద విక్రయం 12,80,650
వాహనపూజలు 16,100
శాశ్వత పూజలు 52,500
అన్నదాన విరాళం 25,264
సువర్ణ పుష్పార్చన 1,38,432
లక్ష్మీ పుష్కరిణి 1,100
యాదరుషి నిలయం 1,09,220
పాతగుట్ట నుంచి 61,930
కొండపైకి వాహనాల అనుమతి 2,75,000
గోపూజ 400