యాదాద్రి, మే 25 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రం, అనుబంధ ఆలయమైన పాతగుట్ట ఆలయంలో క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆలయ అర్చకులు బుధవారం విశేష పూజలు చేశారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్వయంభూ ప్రధానాలయ ముఖ మండపంలో ఆంజనేయుడికి ఆగమశాస్త్ర రీతిలో సింధూరంతో అభిషేకించి, లక్ష తమలపాకులతో అర్చించారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు.
ప్రధానాలయంతో పాటు, పాతగుట్ట లక్ష్మీనర్సింహస్వామి గుండం వద్ద గల ఆంజనేయస్వామి ఆలయంలో అష్టోత్తర శతమన్యుసూక్త పారాయణములతో అభిషేకం, లక్ష తమలపాకులతో అర్చన, మహానివేదన వంటి పూజాధికాలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని యాదాద్రి ఆనుబంధ ఆలయమైన పర్వత వర్ధనీ నమేత రామలింగేశ్వస్వామి ఆలయంలో ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు చేశారు. చతుర్దశ పారాయణాలు, సహస్ర నాగవళి దళార్చనలు చేశారు. ఉత్సవాల్లో ఆలయ ప్రధానార్చకులు, ఉప అర్చకులు, అర్చకులు, ఆలయాధికారులు పాల్గొన్నారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి వారి సన్నిధిలో స్వామి, అమ్మవార్లకు శాస్ర్తోక్తంగా నిత్య కైంకర్యాలు చేపట్టారు. స్వయంభూ ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణం జరిపించారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై పురవీధుల్లో ఊరేగించారు. లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు జరిపించారు. మొదటగా స్వామికి సుదర్శన నారసింహ హోమం చేశారు.
స్వామికి నిత్యపూజలు వేకువజామున 3.30గంటలకు ప్రారంభమయ్యాయి. స్వయంభువులకు ఆరాధనలు జరిపి పంచామృతాలతో అభిషేకించి, తులసీ అర్చనలు చేశారు. అనంతరం లక్ష్మీనర్సింహులను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. భక్తులతో నిర్వహించే సువర్ణ పుష్పార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు.
స్వామివారి సహస్రనామార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి సహస్రనామార్చనలు జరిపారు. పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యారాధనలు శాస్ర్తోక్తంగా చేపట్టారు. సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీవారి ఖజానాకు రూ. 18,72,379 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
శ్రీవారిని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం ఇవ్వగా, ఆలయాధికారులు స్వామివారి ప్రసాదం అందజేశారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 1,84,750
వీఐపీ దర్శనం 75,000
వేద ఆశీర్వచనం 4,800
నిత్యకైంకర్యాలు 9,872
సుప్రభాతం 7,500
క్యారీబ్యాగుల విక్రయం 5,500
వ్రత పూజలు 1,06,400
కళ్యాణకట్ట టిక్కెట్లు 25,000
ప్రసాద విక్రయం 8,56,500
వాహనపూజలు 9,200
అన్నదాన విరాళం 68,675
శాశ్వత పూజలు 95,000
సువర్ణ పుష్పార్చన 1,20,032
యాదరుషి నిలయం 85,530
పాతగుట్ట నుంచి 3 8,720
కొండపైకి వాహన ప్రవేశం 1,75,000
లక్ష్మీపుష్కరిణి 4,800