యాదాద్రి, మే16 : యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ప్రధానాలయంలో సోమవారం ప్రభాతవేళ పరమశివున్ని కొలుస్తూ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం పరమశివుడికి ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. పంచామృతాలతో స్పటిక లింగాన్ని అర్చించారు. పరమశివున్ని విభూతితో అలంకరించారు. ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు కూడా అభిషేకం, అర్చన చేశారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో సోమవారం స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించి, ఆరగింపు చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామివారికి సహస్రనామార్చన చేపట్టారు.
ఉదయం నుంచి రాత్రి వరకు దర్శనాలతో భక్తుల రద్దీ కొనసాగింది. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహహోమం జరిపారు. అనంతరం ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరు కల్యాణోత్సవం వైభవంగా జరిపారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. యాదాద్రి కొండకింద పాతగోశాల వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. అన్ని విభాగాలను కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ. 20,11,930 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దత్తత దేవాలయమైన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని దబ్బగుంటపల్లి యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం స్వామివారి జయంత్యుత్సవాలు వైభవంగా జరిగాయి. ఉదయం 9 గంటలకు స్వస్తీవాచనం, విష్వక్సేన పూజ, అభిషేకం నిర్వహించారు. 11.30 గంటలకు స్వామివారి కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. అనంతరం మహానివేదన, తీర్థ ప్రసాద వినియోగం, ఆశీర్వచనం చేపట్టి ఉత్సవాలకు ముగింపు పలికారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కొండకింద గల లక్ష్మీపుష్కరిణిలో సోమవారం ఆలయ అర్చకులు సంప్రోక్షణ చేపట్టారు. గత ఆదివారం పుష్కరిణిలో యువతి మృతి చెందడంతో ఆలయ సంప్రదాయరీతిలో సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమం చేపట్టారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి హుండీలను మంగళవారం లెక్కించనున్నట్లు ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు. ఉదయం 8 గంటలకు ప్రధాన కార్యాలయంలో లెక్కింపు కార్యక్రమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ప్రధాన బుకింగ్ ద్వారా 1,75,200
వేద ఆశీర్వచనం 12,000
నిత్య కైంకర్యాలు 3,300
సుప్రభాతం 5,200
క్యారీబ్యాగుల విక్రయం 14,500
వ్రత పూజలు 1,66,400
కల్యాణకట్ట టిక్కెట్లు 30,380
ప్రసాద విక్రయం 9,97,500
వాహనపూజలు 11,500
అన్నదాన విరాళం 45,130
శాశ్వత పూజలు 12,500
సువర్ణ పుష్పార్చన 1,00,200
యాదరుషి నిలయం 52,200
పాతగుట్ట నుంచి 55,370
కొండపైకి వాహన ప్రవేశం 2,25,000
లక్ష్మీ పుష్కరిణి 600
గోపూజ 300