యాదాద్రి, ఆగస్టు 8 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో పవిత్రోత్సవాలు పంచరాత్రగమశాస్త్ర రీతిలో సాగుతున్నాయి. రెండో రోజైన సోమవారం 108 నూలు దారాలతో తయారుచేసిన పవిత్ర మాలలను పుణ్య జలాలతో సంప్రోక్షించి స్వామివారికి సమర్పించారు. పాతగుట్టలోనూ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
యాదాద్రి, ఆగస్టు 8 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయంలో సోమవారం పవిత్రోత్సవాలు పంచరాత్రగమశాస్త్ర రీతిలో నిర్వహించారు. స్వామి ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో ఉత్సవమూర్తులకు అర్చకులు తిరుమంజనాలు చేశారు. స్వామిని పట్టువస్ర్తాలు, బంగారు, ముత్యాల ఆభరణాలతో అలంకరించి 108 నూలు దారాలతో తయారు చేసిన పవిత్ర మాలలను పుణ్య జలాలతో సంప్రోక్షించి పూజలు చేశారు.
అనంతరం స్వామివారికి శాంతి హోమం చేశారు. స్వామి, అమ్మవార్లకు మూల, ముక్తి మంత్రాలు, వేదమంత్ర పఠనాలతో హవన పూజలు చేశారు. పూర్ణాహుతి పర్వాలను నిర్వహించి పవిత్ర మాలలను ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మూర్తికుంభ ఆరాధన, పవిత్రమాలల ఆరాధనలు జరిపి పవిత్ర మాలలను కవచమూర్తులకు అలంకరిచారు. మూడ్రోజుల పాటు కొనసాగే పవిత్రోత్సవాలు మంగళవారం ప్రధానాలయంలోని స్వయంభువులకు పవిత్రధారణ, యాగళాలలో మహా పూర్ణాహుతి హోమంతో ఉత్సవాలు పరిపూర్ణం కానున్నాయి.
పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయంలో హవనం, హోమం, అర్చనలు వంటి పూజా పర్వాలు చేపట్టారు. నూలు పోగులతో తయారు చేసిన పవిత్రమాలలకు యాగశాలలో పూజలు చేసి స్వయంభుమూర్తులకు వేశారు. సాయంత్రం వేళలో ఆలయ గోపురం మీదగల సుదర్శన చక్రానికి పవిత్రధారణ గావించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.గీత, ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనర్సింహాచార్యులు, మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, ఆలయ ఏఈఓ దోర్భల భాస్కర్, సురేందర్రెడ్డి, గజవెల్లి రమేశ్బాబు పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ఆలయంలో భక్తుల సందడి కొనసాగింది. శ్రావణ సోమవారం కావడంతో స్వామి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని తిలకించారు. అనంతరం స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
శ్రావణమాసంలో భాగంగా శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన, లక్ష్మీసహస్రనామార్చన కొనసాగుతున్నది. అర్చకులు లక్ష్మీనారసింహుడికి నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. కొండకింద దీక్షాపరుల మండపం వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్దినీ సమేత రామలింగేశ్వరస్వామికి అర్చకులు, పురోహితులు అభిషేక పర్వాలు ఘనంగా నిర్వహించారు. సోమవారం కావడంతో గర్భాలయంలోని లింగేశ్వర కుటుంబంతో పాటు ఆలయంలో నూతనంగా ప్రతిష్టించిన స్పటికలింగేశ్వరుడికి ప్రభాతవేళ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని సుమారు గంటన్నర పాటు నిర్వహించారు. శివాలయం ప్రధాన పురోహితుల ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ చేశారు.
సాయంత్రం రామలింగేశ్వరుడి సేవను శివాలయ మాఢవీధుల్లో ఊరేగించారు. ఆర్జిత పూజల్లో భాగంగా శివాలయం మాఢవీధుల్లో శివ కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పవిత్రోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించే సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవం నిలిపివేశారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామి ఖజానాకు రూ.34,89,243 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఉదయం సుప్రభాతంతో మేల్కొల్పిన అర్చకులు స్వయంభువులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు చేశారు. ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పట్టువస్ర్తాలు, స్వర్ణ అభరణాలతో అలంకరించి నిజాభిషేకం, తులసీ అర్చనలు చేపట్టారు. కొండపైన గల శివాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్వహించే సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పవిత్రోత్సవాల్లో భాగంగా స్వామివారి సుదర్శన నారసింహ హోమం, తిరుకల్యాణ మహోత్సవాలు తాత్కాలికంగా నిలిపివేశారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 1,65,150
వీఐపీ దర్శనాలు 1,50,000
వేద ఆశీర్వచనం 16,800
నిత్య కైంకర్యాలు 2,500
సుప్రభాతం 1,200
క్యారీబ్యాగుల విక్రయం 19,250
వ్రత పూజలు 91,200
కళ్యాణకట్ట టిక్కెట్లు 36,000
ప్రసాద విక్రయం 9,14,110
వాహనపూజలు 11,300
అన్నదాన విరాళం 23,584
సువర్ణ పుష్పార్చన 1,29,516
యాదరుషి నిలయం 1,00,016
పాతగుట్ట నుంచి 26,720
కొండపైకి వాహన ప్రవేశం 2,00,000
లక్ష్మీ పుష్కరిణి 1,000
శివాలయం 8,000
లీసెస్,లీగల్ 13,91,047
ఇతర విభాగాలు 12,000